AP BJP: చేరికలపై బీజేపీ ఫోకస్.. కాషాయ కండువా కప్పుకోవాలంటే ఈ పరీక్ష నెగ్గాల్సిందేనట..!

| Edited By: Balaraju Goud

Jul 04, 2024 | 6:09 PM

అనుకోని మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజకీయ సమీకరణ వేగంగా మారుతున్నాయి. కూటమిలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల మధ్య భవిష్యత్తులో సమన్వయ లోపం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మిత్రపక్షాలతో పరస్పర సహకారంతో ముందుకు వెళ్లడానికి బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు వేస్తుంది.

AP BJP: చేరికలపై బీజేపీ ఫోకస్.. కాషాయ కండువా కప్పుకోవాలంటే ఈ పరీక్ష నెగ్గాల్సిందేనట..!
Ap Bjp
Follow us on

అనుకోని మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజకీయ సమీకరణ వేగంగా మారుతున్నాయి. కూటమిలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల మధ్య భవిష్యత్తులో సమన్వయ లోపం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మిత్రపక్షాలతో పరస్పర సహకారంతో ముందుకు వెళ్లడానికి బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు వేస్తుంది.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇతర పార్టీల నుండి చేరికలు పైన భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. ఎన్నికల ముందు అన్ని పార్టీలో భారీ ఎత్తున చేరికలు జరిగిన విషయం తెలిసింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఆ లెక్కలు మారాయి. గతంలో మాదిరి ఎవర్ని పడితే వారిని ఇష్టానుసారంగా జాయిన్ చేసుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఇకపై జాయిన్ అయ్యే వారి విషయంలో స్క్రూట్నీ చేయనుంది. ఇందుకు సంబంధించి మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు వేసేందుకు సిద్ధమవుతుంది ఏపీ బీజేపీ.

రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి చేరికలు సర్వసాధారణం. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయింపులు, చేరికలు జరుగుతుంటాయి. వ్యక్తుల బట్టి, నియోజక వర్గం బట్టి ఈ చేరికల్లో ప్రాధాన్యత ఉంటుంది. చిన్న చితక లీడర్ల జాయినింగ్ విషయాన్ని పార్టీలు పెద్దగా పట్టించుకోకున్నా, బడా లీడర్లు కండువా మార్చుకుంటున్నప్పుడు మాత్రం తప్పకుండా దృష్టి పెడతారు. ఇక రాబోయే రోజులు ఇది మరింత కఠిన తరం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూటమిలో ఉన్న నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి కాషాయ కండువా కప్పుకునే వారి విషయంలో కీలకంగా వ్యవహరించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోందట.

సాధారణంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు అధికారులు కొత్త ప్రభుత్వంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగానే ప్రజాప్రతినిధులు అధికార భాగస్వామ్యంలో ఉన్న పార్టీలో చేరి వారిని వారు రక్షించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇక గత ఐదేళ్ల ఏపీ రాజకీయాలు దేశంలోనే సంచలనంగా మారాయి. టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ రణరంగం నడిచింది. ఇందులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించగా, బీజేపీ పొత్తుతో తిరుగులేని విధంగా ఏపిలో ఎన్డీయే కుటమి ప్రభంజనాన్ని సృష్టించింది. దాంతో ఇప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధుల గుండెళ్ళో రైళ్ళు పరిగెడుతున్నాయి.

ఇప్పటికే గత ఐదేళ్లు వైసీపీ విధ్వంసకండను సృష్టించిందంటూ మండిపడుతున్న కూటమి నేతలు, రాబోయే రోజుల్లో మాజీ ప్రజా ప్రతినిధు పై ఏ రకంగా వ్యవహరిస్తుందని అందర్నీ హడలెత్తిస్తోంది. దాంతో ఎవరికి వారు కూటమి ప్రభుత్వంలో జాయిన్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇలాంటి వారిపై దృష్టి పెట్టిన బీజేపీ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేనకు మధ్య ఎలాంటి సమన్వయ లోపం రాకుండా అతి తూచి వ్యవహరిస్తోంది. భవిష్యత్తులో కలిసి పరస్పర సహకారంతో ముందుకు వెళ్లేందుకు నిర్ణయాలు తీసుకుంటుందట. గతంలో ఈ రెండు పార్టీలో ఉండి వైసీపీలోకి వెళ్లి, తిరిగి మళ్ళీ కూటమి ప్రభుత్వంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారు గానీ, వైసీపీ నుంచి బీజేపీలోకి వచ్చేవాళ్ళు ఇలా ఎవరినైనా సరే ఇకపై స్క్రూట్నీ చేయనున్నారట. గతంలో వీరిపైన ఉన్న ఆరోపణలు ఏంటి..? ఎందుకని ఇప్పుడు పార్టీ మారుతున్నారు లాంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే వారిని పార్టీలో జాయిన్ చేసుకోవాలో వొద్దో ఒక నిర్ణయానికి రానున్నారట.

గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల విచారణల నుండి బయటపడడానికి ప్రస్తుత ప్రభుత్వంలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలతో పాటు వారిని జాయిన్ చేసుకోవడం వల్ల కూటమిలో ఉన్న పార్టీలకు ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకోనున్నారట. వేసిన కమిటీల ప్రకారం చిన్న లీడర్ల అయితే మండల స్థాయి కమిటీలు జిల్లా స్థాయి చర్చించి నిర్ణయాలు తీసుకుంటాయట. ఒకవేళ పెద్ద లీడర్ అయితే రాష్ట్ర స్థాయి కమిటీలు ఆ జాయినింగ్ కు సంబంధించి పూర్తి స్క్రూట్నీ చేసిన తర్వాత కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్లయితేనే బీజేపీ కండువా కప్పుకునేందుకు ఒప్పుకుంటుందట. దీనికి సంబంధించి త్వరలోనే కమిటీ వేసేందుకు సిద్ధం అవుతుంది ఏపీ బీజేపీ. దాంతో రాబోయే రోజుల్లో కాషాయ కండువా కప్పుకోవాలంటే స్క్రూట్నీ తప్పనిసరట..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..