
ఆంధ్రప్రదేశ్ ట్రోపో ఆవరణములో వీస్తున్న గాలులు, విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆదివారం వాతావరణం ఇలా
ఆదివారం మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు అల్లూరి జిల్లా అనంతగిరి, పోలవరం జిల్లా గుర్తేడు, అనకాపల్లి జిల్లా కె. కోటపాడు మండలాల్లో (3) తీవ్రవడగాలులు, అలాగే అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం,చీడికాడ, చోడవరం, దేవరపల్లి, మాడుగుల, పరవాడ మండలాల్లో(7) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
శనివారం వాతవరణం ఇలా
శనివారం కర్నూలు(జి) తోవిలో 41.6°C, పోలవరం(జి) యేర్రంపేటలో 40.5°C, నంద్యాల(జి) సంజామలలో 40.4°C, ఏలూరు(జి) ధర్మాజీగూడెం, కడపలో40.3°C, ప్రకాశం(జి) కొప్పెరపాడులో 40.2°C, అనకాపల్లి(జి) దేవరపల్లిలో 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.