Weather Report: ఏపీకి మూడ్రోజుల పాటు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..

ఏపీలో ఎండ ప్రభావం మరింత పెరగనుంది. రానున్న మూడ్రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. ఎండ వేడి పెరగడంతో పాటు వడగాల్పలు కూడా తీవ్రతరం కానున్నాయి. దీంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. వాతావరణశాఖ బులిటెన్ ప్రకారం వివరాలు ఇలా..

Weather Report: ఏపీకి మూడ్రోజుల పాటు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
Summer

Updated on: Mar 11, 2026 | 2:31 PM

ఏపీకి అమరావతి వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రోజుల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించింది. రానున్న కొన్ని రోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని అంచనా వేసింది. దిగువ ట్రోపో ఆవరణములో ఏపీ, యానాంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది.

మూడ్రోజుల పాటు పొడి వాతావరణం

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలో రాబోయే మూడ్రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానములో రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదని స్పష్టం చేసింది. అయితే ఆ తరువాత 3 రోజుల్లో 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక ఎండ తీవ్రత పెరగడంతో పాటు వడగాల్పులు వీచే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. దీంతో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఒకవేళ బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానియాలను తీసుకోవాలని తెలిపింది.

పలు జిల్లాల్లో చిరు జల్లులు

రాయలసీమ, దక్షిణ కోస్తాలో భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. అటు గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 36.2 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వగా.. మరికొన్ని ప్రాంతాల్లో పాక్షింగా మేఘాలు ఆవరించడం వల్ల స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపరితల ద్రోణి కారణంగా పలుచోట్ల చిరు జల్లులు కువరడంతో ప్రజలు ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందారు. అటు నేడు కూడా పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇది చల్లని కబురుగా చెప్పవచ్చు.  మరోవైపు రాష్ట్రంలో మార్చిలోనే ఎండలు దంచికొడుతుండగా.. ఈ నెలాఖరు నాటికి మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో రానున్న మూడ్రోజుల పాటు మాడు పలిగేంతగా ఎండ ప్రభావం ఉండనుంది.

Follow Us