
ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని శనివారం లోపు వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు పయనించే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో శక్రవారం, శనివారం రెండు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీవర్షాలు, చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
దక్షిణాంధ్ర -తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల కింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు. కరెంట్ పోల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. కాలువలు, చెరువులకు సమీప ప్రాంతాల్లో నివశించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గండ్లు పడే అవకాశం ఉంటే.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. సిటీల్లో నివశించే పౌరులు మ్యాన్ హోల్స్ విషయంలో జాగ్రత్తగా వహించాలన్నారు.
శక్ర,శనివారం2-రోజులపాటు దక్షిణకోస్తా,రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీవర్షాలు,అనేకచోట్ల తేలికపాటి నుండి మోస్తారువర్షాలు పడే అవకాశం ఉందని విపత్తులసంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. దక్షిణాంధ్ర-తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. pic.twitter.com/BpRqzOG7sY
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 9, 2022
మరోసారి వాతావరణ శాఖ రెయిన్ అలెర్ట్ ఇవ్వడంతో… రాయలసీమ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొన్ననే భారీ వర్షాలు సీమను ముంచెత్తాయి. పంటలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాలు వరదలతో, బురదలో అల్లాడాయి. అయితే ఎటువంటి ఆందోళన అవసరం లేదని.. అన్ని జాగ్తత్తలు తీసుకుంటున్నామని.. అధికారులు ధైర్యం చెబుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం