
ఏపీలోని దివ్యాంగులకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. వీరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేయగా.. మార్చి 18వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా బుధవారం నుంచి ఇది రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. దివ్యాంగ శక్తి పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో స్త్రీ శక్తి పేరుతో మహిళలందరికీ ఫ్రీ బస్ సదుపాయం ఉండగా.. ఇప్పుడు దివ్యాంగులైన పురుషులు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఏ కేటగిరీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారో.. అదే బస్సుల్లో ఇప్పుడు దివ్యాంగులకు కూడా వర్తింపచేయనున్నారు.
బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని గుంటూరు బస్టాండ్లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ పాస్లు జారీ చేస్తోంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో దివ్యాంగులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా వెళ్లవచ్చు. ఇక మిగతా బస్సుల్లో టికెట్పై 50 శాతం రాయితీ ఉంటుంది. నాన్ స్టాప్, అల్ట్రా డీలక్స్, ఇంటర్ స్టేట్, సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో 50 శాతం రాయితీ కొనసాగనుంది. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు జీరో టికెట్ కండక్టర్లు జారీ చేస్తారు.
అయితే ఉచిత బస్సు ప్రయాణ పథకం ఉపయోగించుకునేందుకు దివ్యాంగులకు బస్ పాస్ కౌంటర్లలో అధికారులు పాస్లు జారీ చేస్తున్నారు. సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డులు తీసుకెళ్లి బస్పాస్ తీసుకోవచ్చు. ఇక గతంలోనే పాస్ ఉంటే ఆ పాస్తోనే ప్రయాణించవచ్చు. ఇక ఆర్టీసీ మొబైల్ యాప్ ద్వారా పాస్ పొందవచ్చు. కొంత ఫీజు ఆన్లైన్లో చెల్లిస్తే డిజిటల్ పాస్ జారీ చేస్తారు. ఇక వాట్సప్ గవర్నెన్స్ వాట్సప్ నెంబర్ ద్వారా కూడా పాస్ పొందవచ్చు. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం వర్తింపచేయనున్నారు.
ఈ నెల 18వ తేదీ నుండి "దివ్యాంగ శక్తి" ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం pic.twitter.com/UTVNIqlaDv
— APSRTC (@apsrtc) March 16, 2026