Andhra Pradesh Govt: కృష్ణా జిల్లాలో బ్యాంకుల ముందు చెత్త డంపింగ్.. ఏపీ సర్కార్ సీరియస్.. బాధ్యులైన అధికారులపై సస్పెన్షన్ వేటు..

కృష్ణా జిల్లాలో పలు బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధిత అధికారులపై చర్యలకు ఉపక్రమించింది.

Andhra Pradesh Govt: కృష్ణా జిల్లాలో బ్యాంకుల ముందు చెత్త డంపింగ్.. ఏపీ సర్కార్ సీరియస్.. బాధ్యులైన అధికారులపై సస్పెన్షన్ వేటు..

Updated on: Dec 28, 2020 | 5:11 AM

Andhra Pradesh Govt: కృష్ణా జిల్లాలో పలు బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధిత అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ప్రకాశ్ రావుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రుణాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ పారిశుద్ధ్య కార్మికులు ఈనెల 24వ తేదీన కృష్ణా జిల్లాలోని 16 బ్యాంకుల ముందు చెత్తను డంపింగ్ చేశారు. దాంతో ఆ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. పారిశుద్ధ్య కార్మికులు చెత్త పోస్తున్న వీడియోను, ఫోటోలను కేంద్ర ఆర్థిక శాఖకు, బ్యాంకుల ఉన్నతాధికారులకు ట్విటర్‌లో ట్యాగ్ చేశారు. దాంతో ఈ విషయం కాస్తా కేంద్రం పెద్దల వరకు వెళ్లింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వ్యవహారంపై బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలను పిలిపించుకుని క్లాస్ తీసుకున్నారట కూడా.

మొత్తంగా ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. య్యూరు నగర పంచాయతీ కమిషనర్‌ ప్రకాశరావును సస్పెండ్ చేస్తూ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ వి.ప్రసన్నవెంకటేశ్‌, మచిలీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఇదిలాఉండగా, బ్యాంకులముందు చెత్తవేసిన మున్సిపల్‌ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వబోమని బ్యాంకర్లకు కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ హామీ ఇచ్చారు.

 

Also read:

Precious Painting Lost : రూ.2.5 కోట్లు విలువైన పెయింటింగ్ విమానాశ్రయంలో పోయింది.. చెత్త కుప్పలో దొరికింది!

గగన్‌యాన్ కోసం గ్రీన్ ప్రొపల్షన్ రాకెట్ సిద్ధం.. వచ్చే ఏడాది ఉంటుందన్న ఇస్రో చైర్మన్ శివన్