Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం అదిరిపోయే ఉగాది గిఫ్ట్.. నేటి నుంచి వీరికి కూడా ఫ్రీ బస్.. ఈ బస్సుల్లోకే ఎంట్రీ

ఏపీలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది గిఫ్ట్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా బస్సు ప్రయాణం అందించనుంది. ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఇవాళ తీసుకురానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకానికి బుధవారం అమరావతిలో శ్రీకారం చుడతారు.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం అదిరిపోయే ఉగాది గిఫ్ట్.. నేటి నుంచి వీరికి కూడా ఫ్రీ బస్.. ఈ బస్సుల్లోకే ఎంట్రీ
Apsrtc

Updated on: Mar 18, 2026 | 7:19 AM

ఏపీలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది.  ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుంది.  ‘దివ్యాంగ శక్తి’ పథకం పేరుతో దీనిని అమలు చేయనున్నారు. ఈ మేరకు బుధవారం పథకాన్ని  సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.  మంగళగిరిలో ఈ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీంతో నేటి నుంచి రాష్ట్రమంతటా దివ్యాంగులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. 40 శాతం వైకల్యం దాటిన దివ్యాంగులకు ఈ పథకం వర్తింపచేయనున్నారు. 4 నుంచి 21 వర్గాల దివ్యాంగులకు ‘దివ్యాంగ శక్తి’ విస్తరించనుండగా.. వీరి వెంట వచ్చే సహాయకులకు బస్ ఛార్జీల్లో 50 శాతం రాయితీ కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 12.76 లక్షల మంది దివ్యాంగులు, సహాయకులకు లబ్ది చేకూరనుంది.

ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.207 కోట్ల వ్యయం

ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.207 కోట్ల వ్యయం కానుంది. ఈ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని మరోసారి నిరూపించింది. గతేడాది డిసెంబర్ 3న నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారు.

21 వర్గాలకు పథకం విస్తరణ

ఇప్పటివరకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేది. ఇకపై 21 వర్గాల దివ్యాంగులకు ఈ సౌకర్యాన్ని విస్తరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. శారీరక-మానసిక దివ్యాంగులు, ఆటిజం, నాడీ సంబంధ వ్యాధులు, పార్కిన్సన్స్, తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ వంటి వ్యాధిగ్రస్తులకు ఈ పథకం వర్తించనుంది. ప్రస్తుతం 1.71 లక్షల దివ్యాంగులకే లబ్ది చేకూరుతుండగా… పథకం విస్తరణతో ఇకపై 11.16 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం పొందనున్నట్లు స్పష్టం చేసింది. వీరిలో పురుషులు 6.86 లక్షల మంది ఉన్నారు. అలాగే ఇప్పటివరకు 33,800 మంది సహాయకులకే రాయితీ లభిస్తుండగా… ఇకపై 1.60 లక్షల మంది సహాయకులకు 50 శాతం రాయితీ లభించనుంది. దీంతో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే మొత్తం లబ్దిదారుల సంఖ్య 2.05 లక్షల నుంచి 12.76 లక్షలకు ఒకేసారి పెరగనుంది.  స్త్రీ శక్తి పథకం వర్తించే 7,264 బస్సుల్లో దివ్యాంగులు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అందనుంది. ఏపీఎస్‌ ఆర్టీసీలో సుమారు 73 శాతం బస్సులకు ఈ పథకాన్ని వర్తింపచేశారు. ఇప్పటికే దివ్యాంగులు, వారి సహాయకులకు 3 సంవత్సరాల కాలానికి ఇచ్చిన పాసులు ఈ కొత్త పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసేందుకు ఉపయోగపడతాయి.

Follow Us