Andhra Pradesh: ఇంటి వద్దకే రేషన్.. ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారందరికీ పండుగే..

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. వేసవి కాలం క్రమంలో ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. మధ్యాహ్న భోజనం తరహాలో డ్రై రేషన్ పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా విద్యార్థుల ఇంటికే అధికారులు వెళ్లి రేషన్ అందిస్తారు.

Andhra Pradesh: ఇంటి వద్దకే రేషన్.. ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం.. వారందరికీ పండుగే..
Students

Updated on: Apr 11, 2026 | 1:58 PM

ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించారు. దీంతో విద్యాసంస్థలు రాష్ట్రవ్యాప్తంగా మూతపడ్డాయి. అయితే ప్రభుత్వ స్కూళ్లల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. సాధారణ రోజుల్లో పిల్లలకు ఈ పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. అయితే వేసవి సెలవుల్లో స్కూల్స్ మూతపడటం వల్ల మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉండదు. ఈ క్రమంలో డ్రై రేషన్ కార్యక్రమాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తొలిసారి రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పిల్లల ఇంటికే రేషన్ పంపనున్నారు. డ్రై రేషన్ పథకం పేరుతో దీనిని అమలు చేయాలని నిర్ణయించారు.

విద్యార్థులకు ప్రత్యేక కిట్

అయితే రాష్ట్రవ్యాప్తంగా పిల్లలందరికీ ఈ పథకం వర్తించదు. కేవలం కరువు మండలాల్లోని పిల్లలకు మాత్రమే దీనిని అమలు చేస్తున్నారు. మొత్తం 51 కరువు మండలాల్లో పిల్లలకు రేషన్ అందిస్తున్నారు. ప్రకాశం, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈ మండలాలు ఉన్నాయి. కరువు మండలాల్లోని పిల్లలు పౌష్టికాహారానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో కొత్త పథకం ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ స్కూళ్లల్లో 1 నుంచి 9వ తరగతి వరకు పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటికి వెళ్లి రేషన్ అందిస్తారు. కిట్ రూపంతో వీటిని అందిస్తారు.

కిట్‌లో ఏం ఉంటాయంటే..?

కిట్‌లో ఒక్కో విద్యార్థికి 35 కోడిగుడ్లు అందిస్తారు. ఇక 21 చిక్కీలు ఉంటాయి. ఇక 1 నుంచి 5 తరగతుల మధ్య పిల్లలకు సన్న బియ్యం 5 కిలోలు, 6 నుంచి 9 తరగతుల మధ్య ఉన్నవారికి 6 కిలోల సన్నబియ్యం అందిస్తారు. విద్యార్థులు లేదా తల్లిదండ్రుల ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా వీటిని అందదిస్తారు. పంపిణీ చేశాక యాప్‌లో వివరాలు పొందుపరుస్తారు. ఇక హెడ్ మాస్టర్లు,. ఎంఈఓలు వీటిని పర్యవేక్షిస్తారు. అక్రమాలు చోటుచేసుకోకుండా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

Follow Us