
ఏపీలో కొత్త ఇళ్ల కోసం ఎదురుచేసేవారికి కూటమి సర్కార్ శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం ఆవాస్ యోజన కింద సొంతిల్లు నిర్మించుకోవాలనుకునేవారికి మంచి అవకాశం కల్పిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి ఇచ్చే ఆర్ధిక సాయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఆర్ధిక సాయం రూ.1.80 లక్షలగా ఉంది.. దానిని రూ.2.50 లక్షలకు పెంచారు. సొంత జాగా ఉండి కొత్త ఇంటి నిర్మాణం చేసుకోవాలనుకునే పట్టణ ప్రజలకు దీని వల్ల లాభం జరగనుంది. రాష్ట్రంలోని లక్షలాది పట్టణ ప్రాంతాలకు ప్రజలకు ఇది వరమని చెప్పవచ్చు. దీంతో అర్హులైన వారందరూ ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
గత ఏడాదిలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం అర్హులను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్ధాయిలో పరిశీలన చేపడుతున్నారు. అనంతరం అర్హులైన వారికి గుర్తించి లబ్దిదారుల జాబితా సిద్దం చేయనున్నారు. త్వరలోనే లబ్దిదారుల లిస్ట్ విడుదల ఉంటుదని తెలుస్తోంది. గతంలో పీఎంఏవై పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు విడతల వారీగా అందించేవారు. కేంద్రం రూ.1.50 లక్షలు అందిస్తే.. ఏపీ ప్రభుత్వం తన వాటాగా రూ.30 వేల సాయం ఇచ్చేది. కానీ పేదలకు మరింత సాయం అందించాలనే ఉద్దేశంతో దానిని ఇప్పుడు రూ.2.50 లక్షలకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల స్థలాలు పేదలకు అందించగా.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 4 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇక లక్షా 56 454 దరఖాస్తులు పెండింగ్ల ఉన్నాయన్నారు. అటు ఏప్రిల్ నుంచి కొత్త ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు. అర్హులైన ప్రతీఒక్కరికీ ఇల్లు మంజూరు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పీఎం ఆవాస్ యోజన పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం ద్వారా కూడా కొత్త ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఇక స్థలం లేనివారికి స్థలంతో పాటు ఇల్లు కూడా నిర్మించి ఇవ్వనున్నారు.