ఏపీలో గంజాయి దందా రూటు మారుతోంది. నగరాలు, పట్టణాలను దాటుకుని ఇప్పుడు గ్రామాల్లోకి విస్తరిస్తోంది. ఏకంగా పంట పొలాల్లో గంజాయి సాగు చర్చనీయాంశంగా మారింది. తాజాగా పల్నాడు జిల్లాలో ఈ మాయదారి మత్తు పంట కలకలం రేపింది. గురజాల మండలం దైద గ్రామంలో గంజాయి సాగు చేస్తూ దొరికిపోయారు బాణావత్ అమరానాయక్, లావూరి శ్రీను నాయక్. కొంతకాలంగా వీరు మిరప చేలో గంజాయి పెంచుతున్నారని గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా సమాచారం పోలీసులు వద్దకు వెళ్లింది.
శనివారం పిడుగురాళ్ల స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో సీఐ కొండారెడ్డి, గురజాల సెబ్ ఎస్సై జయరాం ఇతర స్టాఫ్తో కలిసి వారి పొలాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. నిందితుల పొలాల్లో సుమారు 10 కేజీల గంజాయి మొక్కలు, 2 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన సుమారు 30 కేజీల డ్రై గంజాయిని సీజ్ చేశారు. వాటి విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిందితులను సెబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడే సమీప ప్రాంతంలో మరో వ్యక్తి గంజాయి సేవిస్తుండగా.. అతడిని కూడా పట్టుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..