
మనం సినిమాల్లో చూస్తుంటాం.. పాత కాలపు గుడులు, గోపురాలను తవ్వుతుంటే నిధులు, విగ్రహాలు బయటపడుతుంటాయని. సరిగ్గా అలాంటి ఘటనే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఇనిమెళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఎస్. ఆంజినేయులు స్వగ్రామమైన ఇక్కడ, ఒక పురాతన ఆలయ పునర్నిర్మాణ సమయంలో ఏడు పంచలోహ విగ్రహాలు వెలుగుచూడటం స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. గ్రామంలో చాలా కాలంగా శిథిలావస్థకు చేరిన భావన్నారాయణ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని ఎమ్మెల్యే నిర్ణయించారు.
ఇందులో భాగంగా గత మూడు రోజులుగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమాలు పూర్తి చేసి మూల విరాట్టును పక్కన పెట్టిన తర్వాత, ఆలయ ప్రాంగణంలోని ఒక పాత బావిని గమనించారు. ఆ బావిపై పెద్ద పెద్ద బండరాళ్లు పేర్చి ఉండటంతో, వాటిని తొలగించి నీటిని తోడటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అందరూ ఆశ్చర్యపోయేలా ఏడు అరుదైన పంచలోహ విగ్రహాలు ఆ నీటి అడుగున లభ్యమయ్యాయి. ఈ విగ్రహాలతో పాటు మూడు రాగి రేకులు కూడా దొరికాయి. విగ్రహాలు బయటపడగానే ఎమ్మెల్యే ఆంజినేయులు స్వయంగా వాటిని పరిశీలించి, దేవదాయ శాఖ మరియు పురావస్తు అధికారులకు సమాచారం అందించారు. ఈ విగ్రహాలు ఏ కాలానికి చెందినవి? వీటి చారిత్రక ప్రాధాన్యత ఏంటి? అనే అంశాలపై అధికారులు ఇప్పుడు పరిశోధన చేస్తున్నారు. పాత కాలంలో విదేశీయుల దండయాత్రల సమయంలోనో లేదా దొంగల బారి నుండి రక్షించడానికో ఆలయ విగ్రహాలను ఇలా బావిలో దాచి ఉంచడం ఒక పద్ధతిగా ఉండేది. ఇనిమెళ్లలో కూడా బహుశా శతాబ్దాల క్రితం ఇలాగే చేసి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. ఆ రాగి రేకులపై ఉన్న శాసనాలు చదివితే ఈ ఆలయ పూర్తి చరిత్ర మరియు ఆ విగ్రహాల మిస్టరీ వీడే అవకాశం ఉంది. ఏది ఏమైనా, తన స్వగ్రామంలో ఆలయ పునర్నిర్మాణం చేపట్టిన సమయంలోనే ఇలా విగ్రహాలు బయటపడటాన్ని ఒక శుభసూచకంగా భావిస్తున్నారు ఎమ్మెల్యే.