108 వాహన సిబ్బందే వైద్యులయ్యారు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

|

Aug 06, 2021 | 4:14 PM

108 వాహన సిబ్బంది సమయస్ఫూర్తితో శభాష్ అనిపించుకున్నారు. ప్రసవ వేదనతో తల్లడిల్లితున్న ఒక మహిళకు 108 వాహనంలోనే సుఖప్రసవం చేశారు.

108 వాహన సిబ్బందే వైద్యులయ్యారు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Follow us on

108 వాహన సిబ్బంది సమయస్ఫూర్తితో శభాష్ అనిపించుకున్నారు. ప్రసవ వేదనతో తల్లడిల్లితున్న ఒక మహిళకు 108 వాహనంలోనే సుఖప్రసవం చేశారు. ఆపద సమయంలో వారు చూపిన చొరకు ఆ కుటుంబసభ్యులు చేతులెత్తి దండం పెట్టారు. అనంతపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పెద్దపప్పూరు మండలంలోని జూటూరు గ్రామానికి చెందిన నాగలక్ష్మికి తెల్లవారుజామున 4.30 నిమిషాలకు ఒక్కసారిగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబీకులు 108కి సమాచారం అందించారు. అలాగే జూటూరు గ్రామ ఆశ వర్కర్ రామాంజినమ్మ కూడా కబురు పంపారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే 108 వాహనం అక్కడికి చేరుకుంది.

ప్రసవవేదనతో అల్లాడుతున్న నాగలక్ష్మిని తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో 108సిబ్బంది వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపి ఆశావర్కర్ సహాయంతో వాహనంలోనే డెలివరీ చేశారు. కాసేపటికి నాగలక్ష్మి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో ఆ కుటుంబసభ్యులు ఎంతో సంతోషించారు.

ఆపద సమయంలో దేవుళ్లలా వచ్చారని 108సిబ్బంది, ఆశావర్కర్ రామింజినమ్మకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్నవారెవరైనా 108కి కాల్ చేస్తే తమలాగే క్షేమంగా ఉంటారని నాగలక్ష్మి భర్త వెంకటేష్ అన్నారు. 108 వాహన సిబ్బంది సమయస్ఫూర్తిని జిల్లా వైద్య అధికారులు మెచ్చుకున్నారు.

(లక్ష్మీకాంత్, టీవీ9 తెలుగు, అనంతపురం జిల్లా)

Also Read..

AP Crime News: తప్పు.. తప్పు.. రూటు మార్చిన పూజారి.. భక్తులకు అడ్డంగా దొరికిపోయాడు

Kadapa News: కడప జిల్లాలో దారుణం.. తల్లీ కూతుళ్లను కత్తులతో నరికి చంపిన దుండగులు