
ఆస్తికోసం అత్తమామల మీద కోపంతో.. ఐదేళ్ల బావమరిదిని హత్య చేశాడు ఓ దుర్మార్గుడు.. ఈ షాకింగ్ ఘటన అనంతపురం జిల్లాలోని యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు .. నిందితుడు బావనని గుర్తించారు. నిందితుడు సర్వేష్ ను అదుపులోకి తీసుకుని విచారించి.. ఐదేళ్ల హేమచంద్ర డెడ్ బాడీని గుర్తించారు.. ఈ క్రమంలోనే.. మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బాలుడు హేమచంద్ర హత్య కేసులో నిందితుడు సర్వేశ్ పై పోలీసులు కాల్పులు జరిపారు. బాలుడు హేమచంద్ర హత్య కేసు విచారణలో భాగంగా పోలీసులు నిందితుడు సర్వేశ్ ను సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసేందుకు హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు.
ఉదయం 5 గంటలకు యాడికి పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడు సర్వేశ్ ను సీనరీ కన్స్ట్రక్షన్ చేసేందుకు బాలుడు హేమచంద్ర డెడ్ బాడీ లభ్యమైన ప్రదేశానికి కుందనకోట అటవీ ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లారు. కుందనకోట కొండల్లో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితుడు సర్వేశ్ ఒక్కసారిగా పాత బీర్ బాటిల్ తో కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ పై దాడి చేశాడు. దీంతో సీఐ రామసుబ్బయ్య నిందితుడు సర్వేశ్ ను కట్టడి చేసేందుకు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడు సర్వేశ్.. సిఐ రామసుబ్బయ్య పై కూడా బీర్ బాటిల్ తో దాడి చేసి గాయపరిచాడు. దీంతో సి రామసుబ్బయ్య నిందితుడు సర్వేశ్ కాలుపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల అనంతరం గాయపడ్డ నిందితుడు సర్వేశ్ ను పోలీసులు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిందితుడు సర్వేశ్ ను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో సిఏ రామసుబ్బయ్య, కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ చేతికి గాయాలవడంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స అందిస్తున్నారు. కాల్పుల ఘటనతో ఒక్కసారిగా అనంతపురం జిల్లా ఉలిక్కిపడింది.
కాల్పుల అనంతరం హుటాహుటిన తాడిపత్రి అడిషనల్ ఎస్పీ ప్రభుత్వాసుపత్రికి చేరుకొని.. పోలీసులకు అందుతున్న చికిత్స పై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అటు జిల్లా ఎస్పీ కూడా హుటాహుటిన తాడిపత్రి చేరుకున్నారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ లో భాగంగానే నిందితుడు సర్వేశ్ ను హత్య జరిగిన కుందనకోట కొండల్లోకి తీసుకెళ్లగా.. అక్కడ నిందితుడు సర్వేశ్ పోలీసులపై తిరగబడడంతో.. సీఐ రామసుబ్బయ్య కాల్పులు జరిపారని ఎస్పీ జగదీష్ తెలిపారు. చిన్నపిల్లలపై ఎవరైనా అకృత్యాలకు పాల్పడితే.. నిందితులను ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..