ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మూడు రోజులు జమ్మలమడుగు, పులివెందుల, కడప, మైదుకూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగులో స్టీల్ప్లాంట్, మైదుకూరులో కుందూ ప్రాజెక్ట్, రాయచోటిలో హంద్రీనీవా ప్రాజెక్ట్లకు జగన్ శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు. కాగా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తన సొంత జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించడం ఇదే తొలిసారి.
అయితే మొగవాగు, కుందూ ఎత్తిపోతల పథకాల ద్వారా పులివెందులకు నీరు రానున్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే జలనవరుల శాఖ ప్రతిపాదనల్ని సిద్ధం చేయగా.. త్వరితగతిన పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. జగన్ చేతులమీదుగా ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన పూర్తి కాగానే.. పనులు చేపట్టేలా కార్యాచరణ చేపట్టారు. మొత్తం మీద తన సొంత జిల్లాలో 5 వేల కోట్ల విలువైన పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు సమాచారం.