Andhra Pradesh: బీజేపీలో చేరిన అమలాపురం ఎంపీ చింతా అనురాధ భర్త రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి
మాజీ ఐఆర్ఎస్ అధికారి, అమలాపురం ఎంపీ చింత అనురాధ భర్త టిఎస్ఎన్ మూర్తి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని టిఎస్ఎన్ మూర్తి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పి.గన్నవరం టికెట్ను బీజేపీ తరఫున టిఎస్ఎన్ మూర్తి ఆశిస్తున్నారు.
మాజీ ఐఆర్ఎస్ అధికారి, అమలాపురం ఎంపీ చింత అనురాధ భర్త టిఎస్ఎన్ మూర్తి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని టిఎస్ఎన్ మూర్తి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పి.గన్నవరం టికెట్ను బీజేపీ తరఫున టిఎస్ఎన్ మూర్తి ఆశిస్తున్నారు. అయితే ఈ స్థానంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సరిపెల్ల రాజేష్ పేరును ప్రకటించింది. ఆ తర్వాత ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ పేరు తెర మీదకు వచ్చింది. తాజాగా అనుహ్యంగా టిఎస్ఎన్ మూర్తి బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇదిలావుంటే తనకు పి.గన్నవరం నుంచి అవకాశం కల్పించాలని అయ్యాజీ వేమ బీజేపీ అధిష్టానాన్ని కోరారు. అయితే రిటైడ్ ఐఆర్ఎస్ అధికారి, అమలాపురం ఎంపీ భర్త టిఎస్ఎన్ మూర్తి కషాయం కండువాతో పి.గన్నవరం టికెట్ గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పురందరేశ్వరిని పోటీ చేసే అవకాశం కల్పించాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటిని కలవడంతో మూర్తి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఒక దశలో అమలాపురం పార్లమెంటు పొత్తులో బీజేపీ తీసుకుంటుందని అమలాపురం ఎంపీ అభ్యర్థిగా టి ఎస్ ఎన్ మూర్తిని బీజేపీ నిలబెడుతుందనే ప్రచారం కూడా సాగింది.
అయితే వైసీపీ తరపున అమలాపురం ఎంపీ చింతా అనురాధ వైసీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆమె భర్త మూర్తి బీజేపీలో చేరడంతో అనురాధ కూడా బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. అయితే అ ప్రచారాన్ని చింతా అనురాధ తీవ్రంగా ఖండించారు. అమలాపురం నుంచి తిరిగి అనురాధకు వైసీపీ అధిష్టానం అవకాశం ఇవ్వలేదు. ఎంపీ అభ్యర్థిగా వైసీపీ రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పేరును ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాస్త అసంతృప్తితో ఉన్న అనురాధపై పార్టీ మారుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.
అయితే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో పార్టీలోకి మారుతున్నట్లు ప్రచారం సాగుతోందని ఇది పూర్తిగా అవాస్తవం అని అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ కొట్టిపారేశారు. తాను పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన సందర్భంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సాయం మరువలేనిదన్నారు. అటువంటి నాయకుని నీడలోనే పని చేస్తాను తప్పా, మరో గూటికి చేరే వ్యక్తిని కాననీ అనురాధ స్పష్టం చేశారు. తన భర్త పేరు చెప్పకుండా బీజేపీ అభ్యర్థిగా పేరు వినబడుతున్న వ్యక్తితో తన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని, ఆయన ఎన్ని పార్టీలు మారినా తాము మారమని తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వెంటే తమ పయనం అని అనురాధ స్పష్టం చేశారు. ఇదిలావుంటే గత కొంతకాలంగా చింతా అనురాధ భర్త టిఎస్ఎన్ మూర్తి ఆమెకు దూరంగా ఉంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…