
ఆయనో వ్యవసాయశాఖ అధికారి… ఎరువుల దుకాణంలో నకిలీ మందులు విక్రయిస్తున్నారంటూ వ్యాపారిని బెదిరించి లంచం డిమాండ్ చేశాడు… కనీసం శాంపిల్స్ కూడా సేకరించకుండా లంచం ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నిస్తే, అదంతా నాకు తెలియదు, నీ దుకాణంలో నకిలీ సరుకుందని నివేదిక పంపిస్తే నీ పని ఖతం అంటూ హుంకరించాడు… అయితే ఆ అధికారికి లంచం ఇవ్వడానికి నిరాకరించిన ఆ వ్యాపారి ఏసిబి అధికారులను ఆశ్రయించడంతో ఇంట్లోనే లంచం తీసుకుంటున్న ఆ అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
మార్కాపురం జిల్లా కంభం వ్యవసాయ శాఖ అధికారి షేక్ మహమ్మద్ తన ఇంటిలో 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు… కంభం మండలం తురిమెళ్ళ గ్రామానికి చెందిన ఎరువుల దుకాణదారుడు రవీంద్ర కుమార్ దగ్గర నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఒంగోలు ఏసీబీ ఇన్ఛార్జ్ డిఎస్పీ రామకృష్ణుడు తెలిపారు… సాధారణంగా ప్రతియేటా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేసి నివేదికలు ఉన్నతాధికారులు పంపాల్సి ఉండగా తురిమెళ్ళలో రవీంద్ర దుకాణంలో ఎలాంటి శాంపిల్స్ సేకరించకుండానే తప్పుడు నివేదిక పంపుతానని వ్యవసాయశాఖ అధికారి షేక్ మహమ్మద్ బెదిరించాడని తెలిపారు… తన దుకాణంలో ఎలాంటి శాంపిల్స్ సేకరించకుండా అధికారి లంచం కోసం బెదిరిస్తున్నట్టు బాధితుడు తమని ఆశ్రయించడంతో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు తెలిపారు… తర్వాత వ్యవసాయ శాఖ కార్యాలయంలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు.