ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే గెలుపు గుర్రాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో భేటీ అవుతోన్న జగన్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇక తాజాగా ఈ ప్రక్రియకు రెండు రోజులు బ్రేక్పడగా మంగళవారం తిరిగి ప్రారంభంకానుంది.
రెండు రోజుల విరామం తర్వాత వైసీపీ మళ్లీ కసరత్తు మొదలెట్టింది. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో భేటీ అయిన వైసీపీ అధినేత, సీఎం జగన్.. ఇవాళ ఉత్తరాంధ్ర నేతలతో సమావేశం అవుతున్నారు. రెండు మూడు రోజుల్లో ఫైనల్ లిస్ట్ను కూడా ఒకేసారి ప్రకటించేస్తారనే టాక్తో నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇక ఎన్నికల టైం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలకు టికెట్ టెన్షన్ పట్టుకుంది. 175టార్గెట్తో ముందుకెళ్తున్న వైసీపీ.. గెలుపు గుర్రాల ఎంపికపై దృష్టి పెట్టింది.
చిన్న బ్రేక్ తర్వాత ఇవాళ్టి నుంచి మళ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉత్తరాంధ్ర నేతలతో భేటీ అవుతున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న టెన్షన్ నేతల్లో నెలకొంది. రెండో లిస్ట్ ప్రకటనకు బ్రేక్ పడటం.. ఇదే గ్యాప్లో న్యూఇయర్ కలిసి రావడంతో.. బాస్ను ప్రసన్నం చేసుకునేందుకు నేతలకు మంచి టైమింగ్ కుదిరింది. దీంతో మరోసారి తమకు అవకాశం ఇవ్వాలంటూ అధినేతను కలిశారు కొందరు నేతలు.
పనిలోపనిగా న్యూ ఇయర్ విషెష్ చెప్పేందుకు నిన్న పెద్ద ఎత్తున సీఎంవోకు క్యూ కట్టారు ఎమ్మెల్యేలు, నేతలు. సీఎంతో పాటు కీలక అధికారులను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. సీఎంవోకు వచ్చి ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రి జోగి రమేష్ తో పాటు ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్, విజయవాడ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక జగన్ మోహన్ రావు ఉన్నారు. వీరుమాత్రం న్యూ ఇయర్ విషెష్ చెప్పేందుకు మాత్రమే వచ్చామే తప్పా మరే ఇతర కారణం లేదన్నారు.
ఇక సర్వేల ఆధారంగా ఇప్పటికే నేతలను ఫిల్టర్ చేస్తోంది వైసీపీ. ఇప్పటికే తొలి జాబితాలో 11 స్థానాల్లో నోకాంప్రమైజ్ అంటూ ఇంచార్జిలను మార్చేసింది. ఎక్కడెక్కడైతే మార్పులు చేస్తున్నారో ఆయా స్థానాల్లో ఎమ్మెల్యేలతో పాటు ఇంచార్జిలను సీఎంవోకు పిలిపించి స్వయంగా వారితో మాట్లాడుతున్నారు సీఎం జగన్. గత 10రోజులుగా ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి విశాఖ, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నేతలను పిలిచి మాట్లాడారు. ఫైనల్గా ఆయా జిల్లాలో కసరత్తు పూర్తి చేశారు.
కాగా ఈ రోజు నుంచి మిగిలిన జిల్లాలు, పెండింగ్లో ఉన్న స్థానాలపైనా అధినేత జగన్ ఫోకస్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదట వైసీపీనేతలు చెప్పినట్లు.. రెండు, మూడు జాబితాల్లా కాకుండా.. పూర్తి స్థాయిలో వచ్చే రెండు మూడు రోజుల్లో ఫైనల్ లిస్ట్ రెడీ చేసి రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే శుక్రవారంలోగా వైసీపీ ఫైనల్ లిస్ట్ ప్రకటన ఉండే ఛాన్స్ లేకపోలేదు. దీంతో ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? నేతల భవితవ్యమేంటో తేలనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..