మందుకొట్టి ఇంటికొచ్చిన భర్త.. మెడకు చున్నీ బిగించి హత్య చేసిన భార్య!

నిత్యం మద్యం సేవించి వేదిస్తున్న భర్తను భరించలేక ఓ ఇల్లాలు మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. అనంతరం దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేసింది. పోలీసుల ఎంట్రీతో అసలు సంగతి బయటపడటంతో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ దారుణ ఘటన..

మందుకొట్టి ఇంటికొచ్చిన భర్త.. మెడకు చున్నీ బిగించి హత్య చేసిన భార్య!
Woman Killed Husband In Visakhapatnam

Updated on: May 26, 2026 | 10:11 AM

తగరపువలస, మే 26: మందు కొట్టి ఇంటికొచ్చిన భర్తతో గొడవ పడిందో ఇల్లాలు. ఆవేశంలో మద్యం మత్తులో ఉన్న భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. ఆనక ఏమీ తెలియనట్లు ఇరుగు పొరుగును పలిచి ఏదో తాగేసి భర్త స్పృహతప్పి పడిపోయాడని లబోదిబోమంది. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే పతి దేవుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అత్తింటి వారు ఆరా తీయగా అసలు నిజం బయట పడింది. దీంతో పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ దారుణ ఘటన విశాఖపట్నంలోని తగరపువలస పరిధి వలందపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తగరపువలస పరిధి వలందపేట గ్రామంలో తాపీమేస్త్రి బోర సూరిబాబు అలియాస్‌ తాత (28)కి శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగమణి (26)తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి పెళ్లయి ఎనిమిదేళ్లవుతున్నా సంతానం కలగలేదు. నాగమణి స్థానికంగా ఉన్న ఓ న్యూడిల్స్‌ దుకాణంలో పని చేస్తుండగా.. సూరిబాబు తాపీ పని చేసేవాడు. అయితే సూరిబాబుకు భార్యపై అనుమానం ఉండేది. దీంతో రోజూ తాగేసి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. గొడవల నేపథ్యంలో నాగమణి ఏడాది కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల రాజీతో ఇటీవల భర్త వద్దకు తిరిగి వచ్చింది.

అయితే ఆదివారం (మే 24) సాయంత్రం కూడా మరోమారు సూరిబాబు తాగిరావడంతో నాగమణి అతడితో గొడవపడింది. ఈ క్రమంలో తీవ్ర కోపోద్రిక్తురాలైన ఆమె చున్నీతో భర్త గొంతు బిగించి హత్య చేసింది. అనంతరం భర్త మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇరుగు పొరుగును పిలిచి ఏదో తాగేసి పడిపోయి లేవడం లేదంటూ నాటకాలు ఆడసాగింది. దీంతో వారు సంగివలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు నాగమణి ఈ హత్య చేసిందని భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా నాగమణి నేరం అంగీకరించింది. దీంతో కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us