Visakhapatnam News: పల్లకిలో పెళ్లికూతురు మహారాణిలా వచ్చింది. వేడుకకు వచ్చినవారంతా దంపతులపై తలంబ్రాలు చల్లడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే పెద్ద షాక్. అక్కడున్నవారికి ఏం జరుగుతోందో తెలియలేదు. అందంగా ముస్తాబై పెళ్లిపీటలపై కూర్చున్న పెళ్లికూతురు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పెళ్లికొడుకు ఆమె తలపై జీలకర్ర బెల్లం పెడుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. పెళ్లికూతురు కుప్పకూలడంతో ఆమెకు కళ్లుతిరిగి పడిపోయిందని అంతా భావించారు. ముఖంపై నీళ్లు చల్లినా ఆమె లేవలేదు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు బంధువులు. కాని అప్పటికే ఆ పెళ్లికూతురు ప్రాణాలు వదిలింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆమె బతకలేదు.
ఈ ఘటన విశాఖలోని మధురవాడలో జరిగింది. పెళ్లి తంతూ కూడా పూర్తి కావచ్చిన సమయంలో అనుకోని ఘటన జరగడంతో అంతా షాక్లోనే ఉండిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే పెళ్లికూతురు సృజన చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. వివాహ నేపథ్యంలో గత రెండు రోజులుగా పెళ్లి కూతురు అలసటకు గురై నీరసించిందని బంధువులు తెలిపారు. కానీ ఇలా ప్రాణాలు కోల్పోతుందని భావించ లేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: