
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఎమ్ ఆర్ చికెన్ షాప్ యజమానికి వచ్చిన వినూత్న ఆలోచన స్థానికంగా హాట్టాపిక్గా మారింది. సాధారణంగా తగ్గింపు ధరలు, ఆఫర్లు పెట్టడం సాధారణ విషయమే. కానీ రాజాంలోని ఎమ్ ఆర్ చికెన్ షాప్ మాత్రం అందరి దృష్టిని ఆకట్టుకునేలా రూపాయి నోటు తీసుకువస్తే అరకేజీ చికెన్ ఇస్తామనే ఆఫర్ను ప్రకటించింది. అలా ప్రచారం మొదలైన కొద్ది గంటలలోనే ఈ ఆఫర్ పట్టణంలో చర్చనీయాంశమైంది. కేవలం ఒక రూపాయి నోటు తీసుకువస్తే సరిపోతుందని తెలిసిన ప్రజలు పెద్దఎత్తున షాప్ వద్దకు తరలివచ్చారు. కొంతమంది సరదాగా వస్తే, మరికొందరు నిజంగానే ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలని వచ్చారు.
షాప్ ముందు యువత, మహిళలు, పట్టణవాసులు పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడ్డారు. ఒక్కరోజులోనే షాప్ వద్ద కస్టమర్స్ రద్దీ పెరిగింది. గతంలో కూడా ఈ వ్యాపారి అనేక ఆఫర్లు పెట్టి స్థానికంగా అందరినీ ఆకర్షించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ ఆఫర్ వైరల్ కావడంతో మరింత మంది ఆసక్తి చూపారు. అయితే సహజంగా ప్రస్తుత రోజుల్లో రూపాయి నోటు దొరకడం సహజంగానే కష్టం కావడంతో కస్టమర్లు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదని అభిప్రాయపడుతున్నారు షాప్ యజమాని.
మరికొందరు రూపాయి నోటు వల్ల ఏదో పెద్ద ప్రయోజనం ఉంది కాబట్టి రూపాయి నోటు పొందేందుకు ఈ ఆఫర్ పెట్టారని, కాబట్టి రూపాయి నోటు జాగ్రత్తగా దాచుకోవాలని మరికొందరు రూపాయి నోటు ఉన్నప్పటికి రావడం మానేశారు. గతంలో అనేక చోట్ల ఆఫర్లను చూసినప్పటికీ రాజాంలో మాత్రం కార్తీకమాసం సందర్భంగా పెరిగిన కూరగాయ ధరలకు దీటుగా ఈ ఆఫర్ పెట్టినట్లు ప్రకటించారు. ఈ ఆఫర్ కొనసాగుతుందని ప్రతి ఒక్కరు ఆఫర్ ను వినియోగించుకోవాలని తెలియజేశారు.