Heat Wave Alert: కోళ్లకు వేసవి గండం.. ఒక్క రోజే 10 లక్షల కోళ్లు మృతి!

గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బాణుడు భగభగలాడుతున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, ఉక్కపోతతో ఫారాల్లో గుడ్లు పెట్టే లేయర్‌ కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. ఈ ఏడాది కోళ్ల మరణాలు రెట్టింపు అవ్వడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు..

Heat Wave Alert: కోళ్లకు వేసవి గండం.. ఒక్క రోజే 10 లక్షల కోళ్లు మృతి!
Poultry Industry Crisis In Ap

Updated on: May 25, 2026 | 7:09 AM

తణుకు, మే 25: ఏటా వేసవిలో కోళ్ల మరణాలు సాధారణమైనప్పటికీ ఈ ఏడాది రెట్టింపు కావడంతో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఐదు కోట్ల కోళ్ల పెంపకం జరుగుతుంది. అయితే గత వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతల నెలకొనడంతో దాదాపు 30 నుంచి 50 లక్షల వరకు కోళ్లు చనిపోయినట్లు ఆంధ్రప్రదేశ్‌ పౌల్ట్రీ ఫెడరేషన్‌ ఛైర్మన్‌ కోమటపల్లి సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు.

ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 10 లక్షల వరకు కోళ్లు మరణించాయని ఆయన అన్నారు. ఇందులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే దాదాపు మూడు లక్షల కోళ్లు చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు గుడ్ల ఉత్పత్తి కూడా భారీగా తగ్గింది. సాధారణ రోజుల్లో 90 శాతం గుడ్ల ఉత్పత్తి ఉంటుంది. అయితే ప్రస్తుతం 55 నుంచి 60 శాతం మేర గుడ్ల ఉత్పత్తి తగ్గింది. నెల రోజుల కిందట గుడ్డు ధర రూ.5లకి పడిపోవడం, మేత ధరలు పెరగడం వల్ల గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు.

వేసవిలో కోళ్లఫారం నిర్వాహకులు కోళ్లు ఎండల తీవ్రతను తట్టుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే పరిస్థితి మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కోళ్లకు నీరు విరివిగా అందించడం, షెడ్ల చుట్టూ తడి గోనె సంచులు కట్టడం వంటివి చేయాలి. ఎండ తీవ్రత, వేడిగాలులకు దూరంగా ఉంచితేనే కోళ్లు బతుకుతాయని సూచిస్తున్నారు. కనీసం మే నెలాఖరు వరకైనా కోళ్ల పెంపకంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us