23 శాతం ఓటింగ్ సాధించాం.. నాలుగో దశలోనూ ఇదే స్ఫూర్తి కొనసాగించాలి, లెక్కలను అంకెలతో సహా వివరించిన జనసేనాని

|

Feb 19, 2021 | 2:29 PM

పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారులు గణనీయమైన ఫలితాలు సాధించారన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మూడో విడతలో 23 శాతం ఓట్లు సాధించామన్నారు...

23 శాతం ఓటింగ్ సాధించాం.. నాలుగో దశలోనూ ఇదే స్ఫూర్తి కొనసాగించాలి, లెక్కలను అంకెలతో సహా వివరించిన జనసేనాని
Follow us on

పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారులు గణనీయమైన ఫలితాలు సాధించారన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మూడో విడతలో 23 శాతం ఓట్లు సాధించామన్నారు. 270 పైగా పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు దక్కాయన్న ఆయన.. 1654 పంచాయతీల్లో జనసేన మద్దతుదారులు రెండో స్థానంలో నిలిచారన్నారు. ఇదే స్ఫూర్తితో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లోను.. మహిళలు, యువత ముందుకొచ్చి ఓటు వేయాలని కోరారు. యాచించే స్థాయి నుంచి.. శాసించే స్థాయికి పంచాయతీలను తీసుకెళ్లేందుకు జనసేన కృషి చేస్తుందన్నారు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో పంచాయతీలను ఎన్నో ఒత్తిళ్లు, ఇబ్బందులను ఎదుర్కొని జనసేన కైవసం చేసుకుందన్నారు పవన్. కుప్పం నియోజకవర్గంలో పంచాయతీలు, వార్డులను జనసైనికులు గెలవడం మార్పునకు సంకేతమని స్పష్టం చేశారు.

పోరాటయాత్ర సమయంలో అరకు ఏజెన్సీ డుంబ్రిగూడ మండలంలో పర్యటించానన్న పవన్.. ఆ ప్రాంతంలో గణనీయమైన సంఖ్యలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లుగా జనసైనికుల గెలుపొందారన్నారు. కొన్ని చోట్ల వేరే పార్టీ నుంచి పోటీ చేసినా, తమ పార్టీకి ఓట్లు వేయకపోయినా ప్రభుత్వ పథకాలన్నీ తీసేస్తామని అధికార పార్టీ నేతలు బెదిరించారు. అయినా జనం జనసేన మద్దతుదార్లను గెలిపించారని పవన్‌ వివరించారు. కుల, మతాలకు అతీతంగా ఆశయాలు, భావజాలం గల వ్యక్తులు బయటకు రావాలని 2008లో కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్ స్థాపించాను.. ఆ సంస్థే జనసేన పార్టీగా రూపుదిద్దుకుందని పవన్ వివరించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. మార్పు వస్తుందనే నమ్మకం కల్గించాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో యువత, మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి పోరాటం చేయడం హర్షించదగ్గ విషయం. అధికార పార్టీ ప్రలోభాలకు ఎదురొడ్డి ఆడపడుచులు బయటకు వచ్చి పోటీ చేయడం ఆనందాన్నిచ్చిందన్నారు జనసేనాని.