
గుండెపోటు ప్రాణాలు తీస్తోంది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ పొట్టనబెట్టుకుంటోంది.. తాజాగా గుండెపోటుతో 22ఏళ్ల యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తోకచిచ్చు నిహార్ రాజు కన్నుమూశాడు.. రాత్రి అన్నం తిని పడుకున్న కొడుకు.. హార్ట్ ఎటాక్తో చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..
వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోట గ్రామానికి చెందిన మురళీధర్ రాజు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో పనిచేస్తున్నారు. అతని కుటుంబం హైదరాబాద్ మియాపూర్లో నివసిస్తోంది. ఆయనకు ఇద్దరు కుమారులు.. పెద్దకుమారుడు నిహార్ రాజు బీటెక్ పూర్తి చేసి మాదాపూర్ లోని ఓ ప్రయివేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు.. ఎప్పుడు ఆడుతూపాడుతూ ఉల్లాసంగా వుండే నిహార్ గురువారం ఉద్యోగానికి వెళ్లొచ్చాడు.. రాత్రి భోజనము చేసి నిద్రపోయాడు.. శుక్రవారం ఉదయాన్నే లేపమని తల్లికి చెప్పాడు.. ఉదయాన్నే తల్లి నిహార్ను పిలవగా పలకలేదు. దగ్గరికి వెళ్లి చూడగా వాంతి చేసుకోని అచేతనంగా ఉండటంతో.. వెంటనే ఆసుపత్రికి తరలించారు.. అప్పటికే నిహార్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.. హార్ట్ ఎటాక్తో చనిపోయినట్టు తెలిపారు.. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు కన్నుమూయడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు..
మురళిధర్ చిన్న కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు.. నిహార్ తండ్రి మురళీధర్.. బాబాయ్ సత్యన్నారాయణ రాజు ఈ విషయం తెలుసుకుని పుట్టెడు దుఃఖంతో అమెరికా నుంచి శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.. నిహార్ కుటుంబం ఎప్పుడూ సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు చాలా మందికి ఆర్ధిక సాయం అందిస్తుంది.. చేతికి వచ్చిన కొడుకు మరణించడంతో మురళీధర్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి