George Floyds Murder Case: జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి కేసులో కీలక మలుపు.. మాజీ పోలీస్ అధికారి డెరెక్‌ చౌవిన్‌ దోషిగా తేల్చిన కోర్టు

జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి మిన్నియా మాజీ పోలీస్‌ అధికారి డెరెక్‌ చౌవిన్‌ కారణమని.. ఆయన్ను దోషిగా పేర్కొంటూ కోర్టు తీర్పు వెలువరించింది.

George Floyds Murder Case: జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి కేసులో కీలక మలుపు.. మాజీ పోలీస్ అధికారి డెరెక్‌ చౌవిన్‌ దోషిగా తేల్చిన కోర్టు
Us Former Cop Derek Chauvin Convicted Of George Floyds Murder

Updated on: Apr 21, 2021 | 8:21 AM

George Floyds Murder Case: ప్రపంచవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఆఫ్రికన్‌-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌(46) మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఫ్లాయిడ్‌ మృతికి మిన్నియా మాజీ పోలీస్‌ అధికారి డెరెక్‌ చౌవిన్‌ కారణమని.. ఆయన్ను దోషిగా పేర్కొంటూ కోర్టు తీర్పు వెలువరించింది. 12 మంది సభ్యులున్న జ్యూరీ 10 గంటలపాటు విచారించి ఈ ఘటనను సెకండ్‌ డిగ్రీ హత్య, థర్డ్‌ డిగ్రీ హత్య, నరహత్యగా పేర్కొంటూ తీర్పు వెల్లడించింది. కాగా, ఇందుకు సంబంధించిన శిక్షను తరువాత ప్రకటించనున్నట్లు సమాచారం.

జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి కేసు విచారణ సందర్భంగా కోర్టు ప్రాంగణానికి భారీగా జనం తరలివచ్చారు. తీర్పు వెలువడిన అనంతరం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తీర్పు చెప్పే సమయంలో మాస్క్‌తో ఉన్న డెరెక్‌ ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించలేదు. మరోవైపు కోర్టు వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా ఉండేందుకు భారీఎత్తున బలగాలు మోహరించాయి. జార్జ్‌ హత్య జరిగిన సమయంలో డెరిక్‌తో పాటు ఉన్న మరో ముగ్గురు పోలీసులపైనా అభియోగాలు నమోదయ్యాయి. ఇందుకు సంబంధించి విచారణ ఆగస్టు నుంచి కొనసాగుతుంది. తీర్పు వెలువడిన అనంతరం జార్జ్‌ కుటుంబ సభ్యులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ శ్వేతసౌధానికి పిలిచి మాట్లాడారు. అమెరికాలో న్యాయం జరిగిన రోజుగా కమలా హారిస్‌ అభివర్ణించారు.

ఇదిలావుండగా, 2020 మే 25న దుకాణంలో నకిలీ నోట్లు సరఫరా చేశారన్న ఆరోపణలతో జార్జ్‌ ఫ్లాయిడ్‌ను శ్వేతజాతి పోలీసు అధికారి డెరెక్‌ పట్టుకుని రోడ్డుపై పడుకోబెట్టి మెడపై మోకాలితో తొక్కిపెట్టాడు. ఈ క్రమంలో జార్జ్‌ తనకు ఊపిరి ఆడడం లేదంటూ ఎంత మొత్తుకున్నా ఆ కర్కశ పోలీసు కనికరించలేదు. ఫలితంగా జార్జ్‌ అక్కడికక్కడే మరణించాడు. దీంతో అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. నిరసనకారుల ఆందోళనలతో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య, కుమారుడిని బంకర్‌‌లోకి వెళ్లారు. దాదాపు గంట పాటు ఆయన అక్కడే ఉన్నారని సమాచారం. నల్లజాతీయులపై దాడికి నిరసనగా కరోనా సైతం లెక్క చేయకుండా వేలాది మంది ప్రజలు రోడ్డెక్కారు. దీంతో అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాలు కర్ఫ్యూ విధించాయి. ఆ సమయంలో ప్రపంచమంతా జార్జ్‌కు మద్దతుగా నిలిచింది

కాగా, జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై పోస్టుమార్టం నివేదిక కూడా దారుణ హత్య అని వైద్యులు తేల్చారు. మెడపై కాలు మోపి, నొక్కి పెట్టి కుదిపేసి హత్య చేశారని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. ‘జార్జ్ ఫ్లాయిడ్‌ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. కార్డియోపల్మోనరీ అరెస్టుకు గురయ్యాడు. అదే సమయంలో మెడ కుదుపునకు లోనైంది. అతడి మరణాన్ని నర హత్యగా పేర్కొనవచ్చు’ అని నివేదికలో వివరించారు. జార్జ్ మరణించిన విధానం చట్టానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు.

Criminal: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బాత్రూమ్ కిటికీ నుంచి దూకిన నేరస్థుడు.. ఆ తర్వాత ఏమైందంటే..?