ఊహించిందే జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సెనేట్లో ఊరట లభించింది. రిపబ్లికన్ల మెజార్టీ ఉన్న ఎగువసభ ట్రంప్ను నిర్దోషిగా తేల్చింది. రెండు వారాల విచారణ అనంతరం సెనేట్లో అభిశంసన తీర్మానం వీగిపోయింది.
అధికార దుర్వినియోగం, చట్టసభలను అడ్డుకున్నారన్న అభియోగాలపై జరిగిన ఓటింగ్లో ట్రంప్ ఈజీగా గట్టెక్కారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగంపై ట్రంప్కు అనుకూలంగా 52మంది..వ్యతిరేకంగా 48మంది ఓటేశారు. ఇక చట్టసభలను అడ్డుకున్నారన్న అభియోగంపై 53-47ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఐతే అధికార దుర్వినియోగం అభియోగంపై రిపబ్లికన్ సెనేటర్ మిట్ రోమ్నీ మాత్రం ట్రంప్కు వ్యతిరేకంగా ఓటేశారు.
డెమోక్రాట్ల అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న జో బిడెన్ కుటుంబంపై దర్యాప్తుకు ఉక్రెయిన్పై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలపై ప్రతినిధుల సభ అవిశ్వాస ప్రక్రియ చేపట్టింది. గతేడాది డిసెంబర్ 18న ప్రారంభమైన ఈ ప్రక్రియలో..దిగువసభ ట్రంప్కు వ్యతిరేకంగా ఓటేసింది. అనంతరం ఎగువసభకు వచ్చిన అభిశంసన తీర్మానంపై..సుదీర్ఘ చర్చ ఓటింగ్ అనంతరం ట్రంప్ను నిర్దోషిగా తేల్చింది.