Russia-Ukraine War: రూ.4 వేలు విరాళం ఇచ్చిన యువతి.. 12 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు! ఎందుకంటే

|

Aug 16, 2024 | 12:19 PM

ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ పతాక స్థాయికి చేరుకుంది. శత్రుదేశానికి మద్దతుగా నిలిచే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. తాజాగా అమెరికా-రష్యన్‌ జాతీయురాలైన సేనియా ఖావానా (33) అనే మహిళ ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాలు అందించింది. ఈ విషయం కాస్తా బయటికి పొక్కడంతో రష్యాకోర్టు సదరు మహిళను..

Russia-Ukraine War: రూ.4 వేలు విరాళం ఇచ్చిన యువతి.. 12 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు! ఎందుకంటే
Us Russian Woman Jailed For 12 Years
Follow us on

రష్యా, ఆగస్టు 16: ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ పతాక స్థాయికి చేరుకుంది. శత్రుదేశానికి మద్దతుగా నిలిచే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. తాజాగా అమెరికా-రష్యన్‌ జాతీయురాలైన సేనియా ఖావానా (33) అనే మహిళ ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాలు అందించింది. ఈ విషయం కాస్తా బయటికి పొక్కడంతో రష్యాకోర్టు సదరు మహిళను కఠినంగా శిక్షించింది. దేశ ద్రోహం నేరం కింద ఆమెకు ఏకంగా 12 యేళ్ల జైలు శిక్ష విధించింది. సేనియా విరాళంగా ఇచ్చింది కేవలం 51 డాలర్లు (సుమారు రూ.4200) మాత్రమే. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన రష్యా కోర్టు ఈ మేరకు శిక్ష విధించింది.

రష్యాకు చెందిన సేనియా వృత్తిరిత్యా ఓ డ్యాన్సర్‌. అమెరికా వ్యక్తిని వివాహం చేసుకొని లాస్‌ ఏంజెలెస్‌లో స్థిరపడింది. కుటుంబ సభ్యులను కలిసేందుకు ఇటీవల ఆమె రష్యాకు వెళ్లింది. అయితే, ఉక్రెయిన్‌ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా పనిచేస్తున్న అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు రష్యా అధికారులు గుర్తించారు. దీంతో ఆమెను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉరల్ మౌంటైన్స్ సిటీ యెకాటెరిన్‌బర్గ్‌లో అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమెను గత వారం ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. యూఎస్‌ ఛారిటీకి 51 డాలర్ల నగదు వచ్చినట్లు తేలడంతోపాటు.. సేనియా కూడా నగదు బదిలీ చేసినట్లు అంగీకరించింది. ఇలా సేకరించిన విరాళాలతో ఉక్రేనియన్ సాయుధ దళాల కోసం వైద్య సామాగ్రి, పరికరాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే సేకరించిన విరాళాలను రష్యా వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తారనే విషయం మాత్రం తనకు తెలియదని ఖవానా చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమెపై మోపిన దేశద్రోహం అభియోగాలు రుజువు కావడంతో విచారణలో కోర్టు దోషిగా తేల్చింది. దీంతో రష్యా కోర్టు ఆమెకు 12ఏళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తామని ఆమె లాయర్ మిఖాయిల్ ముషైలోవ్ మీడియాకు తెలిపింది.

కాగా ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాలు వరుస దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా సరిహద్దును దాటి రష్యాలోని కస్క్‌ ప్రాంతంలోకి చొరబడిన ఉక్రెయిన్‌ బలగాలు.. రష్యాలోని సుద్జా నగరాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నాయి. ఈ మేరకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకూ రష్యాలో అక్రమించుకున్న అతిపెద్ద పట్టణం ఇదే కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని అంతర్జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.