
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఘర్షణ ఐదో రోజు ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోంది. ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ కూటమి భీకర దాడులకు దిగగా, ఇరాన్ సైతం అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులతో విరుచుకుపడుతోంది. అమెరికా తన అత్యంత శక్తివంతమైన B2 స్టెల్త్ బాంబర్లను రంగంలోకి దించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా అమెరికా వాయుసేన భీకర దాడులు చేస్తోంది. ప్రధానంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ఆయుధ డిపోలు, క్షిపణి స్థావరాలే టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్లోని దాదాపు 2000 వ్యూహాత్మక ప్రాంతాలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ దాడుల్లో ఇరాన్ కాన్సులేట్ కూడా దెబ్బతినడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.
అమెరికా గగనతల దాడులకు ప్రతిగా ఇరాన్ సముద్ర మార్గంలో గట్టి దెబ్బ కొట్టింది. ఇరాన్ తీరానికి 600 కి.మీ దూరంలో ఉన్న అమెరికా నేవీకి చెందిన US డిస్ట్రాయర్ యుద్ధ నౌకపై ఇరాన్ దాడి చేసింది. అత్యాధునిక ఖదర్-380 మిస్సైల్తో ఈ దాడి చేసినట్లు IRGC ధృవీకరించింది. అమెరికన్ ట్యాంకర్ యుద్ధ నౌకకు రీఫ్యూయలింగ్ చేస్తున్న సమయంలో ఈ దాడి జరగడంతో రెండు నౌకల్లోనూ భారీగా మంటలు వ్యాపించాయి. ఇది అమెరికా నావికాదళానికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
ఇజ్రాయెల్ గుండెకాయ వంటి టెల్ అవీవ్ నగరంపై ఇరాన్ ఊహించని దాడికి పాల్పడింది. ఇరాన్ ప్రయోగించిన సూపర్ సోనిక్ మిస్సైల్ ఇజ్రాయెల్ రక్షణ కవచాలను ఛేదించుకుంటూ టెల్ అవీవ్లో కుప్పకూలింది. దీంతో నగరంలో భారీ విస్ఫోటనం సంభవించింది. దాడులు జరిగిన ప్రాంతం మొత్తం మంటల్లో చిక్కుకుంది.