
మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. హోర్ముజ్ జలసంధి విషయంలో ఎలాంటి బాహ్య జోక్యాన్నీ సహించబోమని ఇరాన్ ఘాటుగా హెచ్చరించింది. ముఖ్యంగా అమెరికా తమ దేశ మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలపై దాడులు కొనసాగిస్తే, భారీ స్థాయిలో ప్రతీకార చర్యలు తప్పవని స్పష్టం చేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇరాన్ ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ ప్రతినిధి మాట్లాడుతూ, హోర్ముజ్ జలసంధి తమ దేశానికి అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతమని, దీనిని ఇరాన్ “రెడ్ లైన్”గా పరిగణిస్తోందని తెలిపారు. ఈ ప్రాంతంలో అమెరికా లేదా ఇతర విదేశీ శక్తుల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే, ఇప్పటివరకు సురక్షితంగా ఉన్న ప్రాంతీయ మౌలిక వసతులు కూడా ఇరాన్ ప్రతీకార దాడులకు గురయ్యే అవకాశముందని హెచ్చరించారు.
ఇరాన్ సాయుధ దళాలు ఇప్పటికే తమ ప్రతిస్పందన ప్రారంభించాయని, పరిస్థితి మరింత ఉద్రిక్తమైతే ఆ చర్యలు మరింత తీవ్రంగా, విస్తృతంగా, వినాశకరంగా మారుతాయని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. దేశ భద్రత, సార్వభౌమాధికార విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, అవసరమైతే అన్ని రకాల చర్యలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఇదే అంశంపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ కూడా స్పందించారు. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ దేశ జాతీయ భద్రతతో నేరుగా ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు. తమపై ఏ దేశం కూడా తన ఇష్టాన్ని రుద్దలేదని, రుద్దనివ్వబోమని స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడే విషయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
ఇదిలావుంటే, అమెరికాతో ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందంపై కూడా ఘాలిబాఫ్ ప్రశ్నలు లేవనెత్తారు. ఒప్పందంలోని నిబంధనలు ఇరు దేశాలు పాటించినప్పుడే దానికి విలువ ఉంటుందని, ఇరాన్కు ప్రయోజనం చేకూరని ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు, యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్కు సంబంధించిన సైనిక లక్ష్యాలపై మరో విడత వైమానిక దాడులు నిర్వహించినట్లు ధృవీకరించింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే సామర్థ్యం ఉన్న సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా తెలిపింది.
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఇరు దేశాలు పరస్పరం హెచ్చరికలు జారీ చేస్తుండటంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశాలపై ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..