Donald Trump: ఇరాన్‌పై మరోసారి భారీ దాడులకు సిద్ధమైన అమెరికా.. మూల్యం తప్పదంటూ డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం!

Trump Warning Iran: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌పై తాజా వైమానిక దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందంపై ఆలస్యం చేస్తే టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇరాన్ ఎదురుదాడులు, పెరుగుతున్న చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

Donald Trump: ఇరాన్‌పై మరోసారి భారీ దాడులకు సిద్ధమైన అమెరికా.. మూల్యం తప్పదంటూ డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం!
Trump Warning Iran

Updated on: Jun 10, 2026 | 10:26 PM

US-Iran Tensions Escalate: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించగా, దీనికి ప్రతిగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడులు జరిపింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. “ఇరాన్‌పై మరిన్ని, మరింత తీవ్ర దాడులు చేపట్టబోతున్నాం. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాన్ని టెహ్రాన్ వృథా చేసుకుంది. ఇప్పుడు దాని మూల్యం చెల్లించాల్సి ఉంటుంది” అని ట్రంప్ వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.

ఇరాన్‌తో శాంతి చర్చలు సాగుతున్నప్పటికీ, రెండు దేశాల మధ్య దాడులు కొనసాగుతుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఇటీవల ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కూడా క్షిపణి దాడులు చోటుచేసుకోవడంతో ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరిగాయి. ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధిని మూసివేసే సామర్థ్యం తమకు ఉందని ఇరాన్ సంకేతాలు ఇస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గం మూసివేత జరిగితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం తాజా దాడుల్లో ఇరాన్‌కు చెందిన వాయు రక్షణ వ్యవస్థలు, కమాండ్ కేంద్రాలు, నిఘా రాడార్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. బందర్ అబ్బాస్, ఖేష్మ్ ద్వీపం ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు ఇరాన్ కూడా అంగీకరించింది. దాడులకు ప్రతీకారం తప్పదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హెచ్చరించారు. అమెరికా దాడులను తమ సార్వభౌమాధికారంపై ఉల్లంఘనగా అభివర్ణించిన ఆయన, ఆత్మరక్షణ హక్కు కింద తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 92 డాలర్లకు చేరుకోగా, ఇంధనంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి.

మరోవైపు, ఇరాన్ తన యురేనియం నిల్వలను వదులుకోవాలని అమెరికా పట్టుబడుతుండగా, ఆంక్షల ఎత్తివేతతో పాటు స్తంభింపజేసిన ఆస్తుల విడుదలను టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది. ఈ కీలక అంశాలపై ఇరుదేశాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇరాన్, హిజ్బుల్లాపై సైనిక చర్యలు కొనసాగుతాయని ప్రకటించారు. దీంతో మధ్యప్రాచ్య సంక్షోభం మరింత విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Follow Us