డాక్టర్ నూతన్ నాయుడుకు ఐక్యరాజ్యసమితి అవార్డు.. శాంతిమండలి అత్యున్నత పురస్కారం అందుకున్న తెలుగు వ్యక్తి..

విశాఖకు చెందిన ప్రముఖ విద్యా, సాంకేతిక రంగ నిపుణులు డాక్టర్ నూతన్ నాయుడుకు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ శాంతి మండలి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును అందజేసింది. ప్రపంచంలోని 17 దేశాల యూనివర్సిటీల నుండి డాక్టరేట్లు సాధించి, ఐక్యరాజ్యసమితిలోనే కీలక సలహాదారుగా ఎదిగిన నూతన్ నాయకుడు ప్రస్థానం గురించి తెలుసుకుందాం..

డాక్టర్ నూతన్ నాయుడుకు ఐక్యరాజ్యసమితి అవార్డు.. శాంతిమండలి అత్యున్నత పురస్కారం అందుకున్న తెలుగు వ్యక్తి..
Dr Nutan Naidu

Updated on: Jun 20, 2026 | 5:45 PM

ప్రొఫెసర్ డాక్టర్ నూతన్ నాయుడు సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ శాంతి, సాంకేతిక నైతికత, సామాజిక సామరస్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నందుకు ఆయనకు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ శాంతి మండలి ప్రతిష్టాత్మకమైన టిటులర్ హానర్స్ పురస్కారాన్ని అందజేసింది. ఈ అంతర్జాతీయ పురస్కారం భారతదేశ కీర్తి పటాన్ని ప్రపంచ వేదికపై మరోసారి నిలిపింది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష సేవలందించిన అంతర్జాతీయ ప్రముఖుల సమక్షంలో ఈ సన్మాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. విశాఖపట్నం మట్టిలో జన్మించిన డాక్టర్ నూతన్ నాయుడు.. ఒక సాధారణ పౌరుడి స్థాయి నుండి అంతర్జాతీయంగా స్థాయికి ఎదగడం అద్భుతమనే చెప్పాలి.

విద్యా రంగంలో చారిత్రాత్మక రికార్డు

డాక్టర్ నూతన్ నాయుడు చదువు, పరిశోధనల రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోని 17 ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ ప్రొఫెసర్‌షిప్‌లతో పాటు డాక్టరేట్లను కూడా అందజేశాయి. హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్గనైజేషనల్ న్యూరోసైన్స్, AI ఎథిక్స్ వంటి కష్టమైన సబ్జెక్టులలో ఇంతటి గొప్ప గౌరవాన్ని సాధించిన మొట్టమొదటి భారతీయ విద్యావేత్త ఆయనే. మన దేశంలోని ఐఐటీ కాన్పూర్, ఐఐఎం కలకత్తా, ఉస్మానియా, ఆంధ్ర విశ్వవిద్యాలయాలతో పాటు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఐవీ లీగ్ విద్యాసంస్థలతో ఆయనకు ఉన్నతమైన అనుబంధం ఉంది.

టెక్నాలజీ, కంపెనీల నిర్వహణలో అనుభవం

నూతన్ నాయుడు న్యూరల్ నెట్‌వర్క్స్ అనే అంతర్జాతీయ సంస్థను ఆయన స్థాపించారు. మనుషుల మెదడు ఆలోచించే విధానాన్ని కంప్యూటర్ అల్గారిథమ్స్‌తో కలిపి సరికొత్త డేటా విశ్లేషణ పద్ధతులను కనిపెట్టారు. దీనివల్ల డిజిటల్ ఎన్నికల వ్యూహాలను రూపొందించడంలో ఆయన అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 25 సంవత్సరాలకు పైగా సాగిన ఆయన కార్పొరేట్ ప్రయాణంలో జీనియస్ ఆఫ్ ది మిలీనియం లాంటి ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆయన రాసిన పుస్తకాలు, ఆయన పేటెంట్ హక్కులు పొందిన విద్యా విధానాలు ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీల చదువుల్లో భాగంగా ఉన్నాయి.

ప్రపంచ దేశాలకు సలహాదారుగా..

డాక్టర్ నూతన్ నాయుడు కేవలం చదువులకే పరిమితం కాకుండా లండన్, యూరప్‌లోని పెద్ద విద్యాసంస్థల్లో గవర్నర్ సెనేట్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఐక్యరాజ్యసమితి కి చెందిన సాంకేతిక దౌత్య విభాగాలకు ఎక్స్‌టర్నల్ ఎక్స్‌పర్ట్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎంతోమంది దేశాధినేతలకు, పలు ఆసియా దేశాల ప్రభుత్వాలకు ఆర్థిక, సాంకేతిక విషయాలలో ఆయన విలువైన సలహాలు అందిస్తుంటారు. మన దేశంలో కూడా ఎంతోమంది పేద ప్రజల జీవితాలను మార్చిన అనేక సామాజిక సంక్షేమ పథకాల వెనుక ఆయన మేధస్సు దాగి ఉంది.

మా నాన్నగారే నా స్ఫూర్తి

ఈ అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకోవడంపై డాక్టర్ నూతన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ‘‘టెక్నాలజీని, మానవ మేధస్సును సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించడమే నా జీవిత ఆశయం. మా నాన్నగారైన సన్యాసి రావు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ, సమాజంలోని వెనుకబడిన వర్గాలకు సేవ చేయడమే నా జీవితానికి ఉన్న అతిపెద్ద లక్ష్యం’’ అని ఆయన చెప్పుకొచ్చారు

Follow Us