Trump Warns Brics: బ్రిక్స్‌ దేశాలపై ట్రంప్‌ కన్నెర్ర… తోక జాడిస్తే సుంకాల దండయాత్రే… ఇండియాతో పాటు…

ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచాక గ్లోబల్ ట్రేడ్ వార్ మొదలయ్యింది. భారత్-అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్‌పై ఉత్కంఠ నెలకొంది. 12 నుంచి సుంకాలు అమలు చేయబోతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. భారత్‌పై 26 శాతం దిగుమతి సుంకాలు ప్రకటించారు ట్రంప్. బ్రిక్స్‌ దేశాలపై అదనంగా 10 శాతం సుంకాలు ఉంటాయని తెలిపారు. బ్రిక్స్‌లో సభ్య దేశమైన భారత్‌పైనా...

Trump Warns Brics: బ్రిక్స్‌ దేశాలపై ట్రంప్‌ కన్నెర్ర... తోక జాడిస్తే సుంకాల దండయాత్రే... ఇండియాతో పాటు...
Trump Warns Brics

Updated on: Jul 07, 2025 | 11:56 AM

ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచాక గ్లోబల్ ట్రేడ్ వార్ మొదలయ్యింది. భారత్-అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్‌పై ఉత్కంఠ నెలకొంది. 12 నుంచి సుంకాలు అమలు చేయబోతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. భారత్‌పై 26 శాతం దిగుమతి సుంకాలు ప్రకటించారు ట్రంప్. బ్రిక్స్‌ దేశాలపై అదనంగా 10 శాతం సుంకాలు ఉంటాయని తెలిపారు. బ్రిక్స్‌లో సభ్య దేశమైన భారత్‌పైనా సుంకాల భారం పడనుంది. అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే సుంకాలు తగ్గే అవకాశం ఉంది. భారత్‌పై సగటు టారిఫ్ దాదాపు 10శాతం ఉండే ఛాన్స్‌ ఉంది. ఎల్లుండితో 90 రోజుల టారిఫ్ విరామ సమయం ముగుస్తుంది.

ఎవరినీ వదిలేది లేదంటున్నారు ట్రంప్‌. ప్రతీకార సుంకాలు అమలుచేసే సమయం ఆసన్నమైందంటున్నారు. ఇప్పటికే 12దేశాలకు టారిఫ్‌ లెటర్లు పంపించారు. బ్రిక్స్‌ దేశాలకు అదనంగా పదిశాతం వడ్డిస్తానంటున్నారు. ఈ సమయంలో భారత్‌ విషయంలో ట్రంప్‌ వైఖరి ఎలా ఉంటుందోనని వ్యాపారవర్గాలు ఉత్కంఠగా చూస్తున్నాయి. బ్రిక్స్‌లో భారత్‌ సభ్యదేశం కావటం, రియో డిక్లరేషన్‌కి మన దేశం కూడా మద్దతివ్వటంతో ట్రంప్‌ మనపైనా కత్తికట్టేలా ఉన్నారు.

ఏప్రిల్‌లో 10 శాతం బేస్ టారిఫ్ రేటుతో చాలా దేశాలకు అదనపు టారిఫ్‌లను ప్రకటించారు. కొన్ని దేశాలపై 50 శాతం వరకు సుంకాలు విధించారు. అయితే చర్చలకు సమయం ఇవ్వడానికి 10 శాతం బేస్ కంటే ఎక్కువగా ఉన్న అన్ని సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేశారు. జూలై9తో ఈ గడువు ముగుస్తుండటం, బ్రిక్స్‌ దేశాలు అమెరికా సుంకాలను తప్పుపట్టటంతో.. టారిఫ్‌ల విషయంలో ట్రంప్‌ పంతంమీదున్నారు.

బ్రిక్స్‌ సదస్సు వేళ ట్రంప్‌ వార్నింగ్‌ కలకలం రేపుతోంది. బ్రిక్స్‌ దేశాలు అమెరికా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ట్రంప్‌ కామెంట్స్‌ సంచలనంగా మారాయి. ఈ మేరకు ట్రూత్‌లో పోస్టు పెట్టారు ట్రంప్‌. ‘అమెరికా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బ్రిక్స్‌ అనుకూలంగా ఉన్న ఏదేశానికైనా అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తాం. ఇందులో ఎలాంటి మినహాయింపులూ ఉండవు’ అని ట్రంప్‌ తన పోస్టులో రాసుకొచ్చారు. బ్రెజిల్‌ వేదికగా జరుగుతున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు వేళ ట్రంప్‌ నుంచి ఈ హెచ్చిరకలు రావడం సంచలనంగా మారింది.

వాణిజ్య ఒప్పందంకోసం కొన్నాళ్లుగా అమెరికాతో చర్చిస్తున్నారు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌. ట్రేడ్‌ డీల్‌ కుదిరితే డెయిరీ, వ్యవసాయరంగాలకు మినహాయింపులు ఉండొచ్చని అంచనావేస్తున్నారు. అయితే బట్టలు, చెప్పులు, లెదర్‌, స్టీల్‌, మెడిసన్‌, అల్యూమినియం, శ్రమ ఆధారిత ఎగుమతులపై టారిఫ్‌లు తగ్గించాలని భారత్‌ కోరుతోంది. భారత్‌పై సుంకాలభారం విషయంలో ట్రంప్‌ కాస్త తగ్గుతారో.. తగ్గేదే లేదంటారో చూడాలి మరి.