ఇరాన్‌తో ‘గ్రేట్ డీల్’ ఖరారు?.. సంతకాలే మిగిలాయని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

మధ్యప్రాచ్య రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు, పరస్పర ఆరోపణల అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఒక కీలక ఒప్పందం దాదాపు పూర్తయిందని ప్రకటించారు. గురువారం (జూన్ 11) వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇరు దేశాల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ప్రస్తుతం కేవలం పత్రాల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు.

ఇరాన్‌తో ‘గ్రేట్ డీల్’ ఖరారు?.. సంతకాలే మిగిలాయని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
Us President, Donald Trump

Updated on: Jun 12, 2026 | 7:10 AM

మధ్యప్రాచ్య రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు, పరస్పర ఆరోపణల అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఒక కీలక ఒప్పందం దాదాపు పూర్తయిందని ప్రకటించారు. గురువారం (జూన్ 11) వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇరు దేశాల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ప్రస్తుతం కేవలం పత్రాల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు.

“మేము ఒక గొప్ప ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఇప్పుడు తుది పత్రాల పనులు జరుగుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది” అని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల ప్రణాళికాబద్ధమైన సైనిక చర్యలను నిలిపివేసిన నేపథ్యంలో వచ్చిన ఈ ప్రకటన అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ వారాంతంలో యూరప్‌లో అమెరికా-ఇరాన్ ఒప్పందంపై అధికారిక సంతకాల కార్యక్రమం జరిగే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. అయితే తాను వ్యక్తిగతంగా హాజరుకాబోనని, అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన వెంటనే ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మళ్లీ పూర్తిస్థాయిలో తెరవనున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ మాత్రం జాగ్రత్తగా స్పందించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ భాగయ్ మాట్లాడుతూ, అమెరికాతో ఇంకా తుది ఒప్పందం కుదరలేదని స్పష్టం చేశారు. చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, వాషింగ్టన్ తరచూ కొత్త డిమాండ్లు తెరపైకి తీసుకువస్తోందని ఆయన ఆరోపించారు. తమ దేశం ఎలాంటి ఒత్తిడికి లొంగదని, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన “రెడ్ లైన్స్” విషయంలో రాజీ పడబోదని పేర్కొన్నారు.

ఇక ఈ ఒప్పందంలోని అత్యంత కీలక అంశం అణ్వాయుధాల అంశమేనని ట్రంప్ వెల్లడించారు. “ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధం ఉండదనే హామీ మాకు లభించింది. వారు అణ్వాయుధాలను అభివృద్ధి చేయరు, కొనుగోలు చేయరు” అని ఆయన చెప్పారు. అయితే ఇరాన్ గతంలో మాదిరిగానే తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని పునరుద్ఘాటిస్తోంది.

అదే సమయంలో ఇరాన్ అత్యున్నత నాయకత్వం కూడా ఈ ఒప్పందానికి మద్దతు తెలిపిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం విజయవంతమైతే మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు ప్రపంచ ఇంధన మార్కెట్లకు కూడా భారీ ఊరటనిచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇరాన్ నుంచి అధికారిక ఆమోదం వెలువడే వరకు ఈ ఒప్పందంపై అనిశ్చితి కొనసాగనుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us