
ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్.. మరోవైపు ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో ఒకరిపై ఒకరు విరుచుకపడుతున్నారు. ఈ నేపథ్యంలో పరిణామం చోటుచేసుకుంది. సముద్ర గర్భంలో తిరుగులేని శక్తిగా భావించే అమెరికా నేవీకి చెందిన యూఎస్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకపై ఇరాన్ సైన్యం విరుచుకుపడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాన్ తీరానికి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా యుద్ధ నౌకను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ ఆపరేషన్లో ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన ఖాదర్-380 మిస్సైల్ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. సుదూర లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి నేరుగా యుద్ధ నౌకను తాకడంతో పెను ప్రమాదం సంభవించింది.
అమెరికా యుద్ధ నౌకకు ఒక ట్యాంకర్ ద్వారా ఇంధనాన్ని నింపుతున్న కీలక సమయంలో ఇరాన్ ఈ దాడికి పాల్పడటం గమనార్హం. సాధారణంగా రీఫ్యూయలింగ్ సమయంలో నౌకల కదలికలు పరిమితంగా ఉంటాయి. ఆ సమయంలోనే టార్గెట్ చేయడంతో అమెరికా డిస్ట్రాయర్, ట్యాంకర్ రెండూ మంటల్లో చిక్కుకున్నాయి. దాడి జరిగిన వెంటనే రెండు నౌకల్లో భారీ ఎత్తున పేలుళ్లు సంభవించాయని ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. సముద్రంపై ఆకాశమంతా దట్టమైన నల్లటి పొగతో నిండిపోయింది. ఈ దాడిలో ప్రాణనష్టం ఎంతవరకు జరిగిందనే దానిపై పెంటగాన్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
మరోవైపు దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. అమెరికా కాన్సులేట్ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చిన డ్రోన్, భవనానికి ఆనుకుని ఉన్న పార్కింగ్ స్థలాన్ని బలంగా ఢీకొట్టింది. డ్రోన్ తాకిన వెంటనే భారీ శబ్దంతో పేలుడు సంభవించి, ఆ ప్రాంతంలో అగ్నిజ్వాలలు చెలరేగాయి. అయితే కాన్సులేట్ లోపల ఉన్న అమెరికా సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ధృవీకరించింది. ఇరాన్ చేస్తున్న ఇలాంటి దుశ్చర్యలకు తగిన బుద్ధి చెబుతామని. మెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్రంగా స్పందించారు.