మలక్కా జలసంధిలో ‘టోల్’ వసూలు..! భారత్ వాణిజ్యానికి భారీ ముప్పు?

ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటైన మలక్కా జలసంధి ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. ఈ మార్గం గుండా ప్రయాణించే ఓడలపై సుంకాలు (Tolls) విధించాలని ఇండోనేషియా యోచిస్తుంది. ఆర్థిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంతోనే ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి పూర్బయ యుధి సదేవ వెల్లడించారు.

మలక్కా జలసంధిలో టోల్ వసూలు..! భారత్ వాణిజ్యానికి భారీ ముప్పు?
Malacca Strait

Updated on: Apr 24, 2026 | 1:20 PM

ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటైన మలక్కా జలసంధి ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. ఈ మార్గం గుండా ప్రయాణించే ఓడలపై సుంకాలు (Tolls) విధించాలని ఇండోనేషియా యోచిస్తుంది. ఆర్థిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంతోనే ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి పూర్బయ యుధి సదేవ వెల్లడించారు.

మలక్కా జలసంధి హిందూ మహాసముద్రాన్ని, పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతూ ఇండోనేషియా, మలేషియా, సింగపూర్‌ల మధ్య విస్తరించి ఉంది. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 25% నుండి 40% వాటా ఈ మార్గం గుండానే జరుగుతుంది. హోర్ముజ్, సూయజ్, పనామా వంటి ప్రధాన మార్గాలతో పోల్చదగిన ఈ జలసంధిలో ఇప్పటివరకు ఎటువంటి సుంకాలు వసూలు చేయడం లేదు.

ఇండోనేషియా ప్రతిపాదనను పొరుగు దేశమైన సింగపూర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సముద్ర మార్గాలు ఎప్పుడూ స్వేచ్ఛగా, అందరికీ అందుబాటులో ఉండాలని సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ స్పష్టం చేశారు. ఈ మార్గంపై ఇతర దేశాలకు కూడా హక్కులు ఉండటం వల్ల ఇండోనేషియా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఈ ప్రణాళిక ప్రారంభ దశలో ఉంది. త్వరలో అమలులోకి వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే దీనికి అనేక దేశాల సమ్మతి అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షిప్పింగ్ కంపెనీలు కూడా దీనిని వ్యతిరేకించవచ్చు.

ఇదిలావుంటే, ఈ మార్గం భారతదేశాన్ని ఆసియాన్ – తూర్పు ఆసియా దేశాలతో కలుపుతుంది. సుంకాల విధింపు నిర్ణయం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ చేసే సముద్ర వాణిజ్యంలో 55% నుండి 60% వరకు ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ముఖ్యమైన వస్తువులు.. ఎల్ఎన్‌జీ (LNG), బొగ్గు, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్ ముడి పదార్థాల సరఫరాకు ఇది జీవనాడి. అండమాన్ నికోబార్ దీవులు ఈ మార్గానికి సమీపంలో ఉండటం భారత్‌కు రక్షణ పరంగా కలిసొచ్చే అంశం.

ఒకవేళ సుంకాలు అమలులోకి వస్తే, దిగుమతి, ఎగుమతి ఖర్చులు పెరిగి భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది. ప్రస్తుతానికి ఈ ప్రణాళిక ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు మరియు పొరుగు దేశాల అంగీకారం లేనిదే ఇది వాస్తవరూపం దాల్చడం కష్టమే. మలక్కా జలసంధి భవిష్యత్తు ఇప్పుడు ప్రపంచ దేశాల దౌత్య నీతిపై ఆధారపడి ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us