కాలిఫోర్నియాలో భారత సంతతి మహిళ దారుణ హత్య

కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో దారుణం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన మహిళ దారుణ హత్యకు గురైంది. భారత సంతతికి చెందిన 38 ఏళ్ల మహిళను 22 ఏళ్ల యువకుడు దారుణంగా కాల్చి చంపేశాడు. ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధిస్తున్నాడని, ఆమె ఒప్పుకోకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.

కాలిఫోర్నియాలో భారత సంతతి మహిళ దారుణ హత్య
India

Updated on: Sep 13, 2026 | 9:59 AM

కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో భారత సంతతికి చెందిన మహిళ దారుణ హత్యకు గురైంది. భారత సంతతికి చెందిన 38 ఏళ్ల మహిళను 22 ఏళ్ల యువకుడు వెంబడించి కాల్చి చంపేశాడు. ఆర్డెన్-ఆర్కేడ్ ప్రాంతంలో ఉన్న పనేరా బ్రెడ్ అవుట్‌లెట్ రెస్టారెంట్ వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే శాలిని ఠాకూర్‌ అనే భారత సంతతి మహిళపై నిందితుడు రోహిత్ దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. హైవే 50పై అతడిని పట్టుకున్నారు. దాడి సమయంలో ఠాకూర్ పారిపోవడానికి ప్రయత్నించగా.. రోహిత్ ఆమెను వెంబడించి పలుమార్లు కాల్పులు జరపాడు. ఆమె కిందపడగా.. దగ్గర నుంచి ఆమె తలపై మరోసారి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మహిళ అక్కడిక్కడే మరణించింది.

మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా.. సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్టారెంట్ బయట ఠాకూర్ స్పృహ కోల్పోయి పడి ఉండటాన్ని గమనించారు. అనంతరం అక్కడికక్కడే మరణించినట్లు ధృవీకరించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడుని చేధించి పట్టుకున్నారు. అనుమానితుడి కారును షెరీఫ్ వాహనాలు, ఒక సాయుధ వ్యూహాత్మక వాహనంతో సహా చుట్టుముట్టి పట్టుకున్నారు. అయితే పోలీసులకు పట్టుబడటంతో నిందితుడు తనంతట తాను తుపాకీతో కాల్చుకుని మరణించాడు. ఈ ఘటనపై శాలిని తల్లి సుదేశ్ కుమారి మాట్లాడుతూ.. రోహిత్ దాదాపు ఏడాదిగా తన కుమార్తెను వెంబడిస్తూ వేధిస్తున్నాడని చెప్పారు. అతను శాలినిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, అయితే వారి మధ్య వయసు వ్యత్యాసం కారణంగా ఆమె అతడిని తిరస్కరించిందన్నారు. ఆమె అతడిని చూసి చాలా భయపడేదని చెప్పుకొచ్చారు.

తన ఏకైక కుమార్తెతో జరిపిన చివరి సంభాషణను సుదేశ్ కుమారి గుర్తు చేసుకున్నారు. తాను తీవ్రంగా కుంగిపోయానని, తన కుమార్తెను కాపాడటానికి ఇంకా ఏమైనా చేయగలిగి ఉండేవారా అని ప్రశ్నించుకున్నానని చెప్పారు. కాల్పులకు దాదాపు గంట ముందు.. మధ్యాహ్నం 1.58 గంటలకు వారిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారని చెప్పారు. 15 నిమిషాల్లో తిరిగి ఫోన్ చేస్తానని ఠాకూర్ తన తల్లికి చెప్పింది.. కానీ చేయలేదని చెప్పారు. శాలిని తన కార్యాలయం నుండి డోర్‌డాష్ పికప్‌ల ద్వారా రోహిత్‌తో పరిచయం ఏర్పడిందని సమాచారం. అతని ప్రవర్తన తీవ్రరూపం దాల్చడంతో భయపడుతూ ఉంటుంది. అతను గంటల తరబడి ఆమె ఇంటి బయట వేచి ఉండటం, ఆమె కారు టైర్లలో గాలి తీసేయడం, ఆమె కదలికలను గమనించడానికి ఆమె వాహనం కింద ఆపిల్ ఎయిర్‌ట్యాగ్‌ను అమర్చడం వంటివి చేశాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us