
పాకిస్థాన్ ఉప ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ సత్తా చాటారు. ఈ ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్కు చెందిన పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ సత్తా చాటింది. మొత్తం 11 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగ్గా 8 చోట్ల పీటీఐ గెలిచింది. ఇమ్రాన్ ఖాన్ ఒక్కరే 7 స్థానాలలో పోటీ చేయగా ఆరు స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంలో ఓటమి చెంది పాక్ ప్రధాని పదవి కోల్పోయారు. దీంతో ఉప ఎన్నికలను ఆయన రిఫరెండంగా భావించారు. ఆయన పార్టీ తాజా విజయాలతో పాక్ ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదించినట్లు తేలిందని పీటీఐ అభిప్రాయపడింది. అటు అధికారపక్షంపై ఈ స్థాయిలో విజయం సాధించడం మాములు విషయం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
అయితే 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగ్గా అధికార పక్షం కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. వీటిలో ఆరు నేషనల్ అసెంబ్లీ స్థానాలతో పాటు మరో రెండు అసెంబ్లీ ప్రావిన్సుల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ గెలిచింది. ఒక వ్యక్తి ఎన్ని స్థానాలలో అయినా పోటీ చేయవచ్చనే వెసులుబాటును ఇమ్రాన్ ఖాన్ ఉపయోగించుకున్నారు. దీంతో ఆయన ఏకంగా 7 చోట్ల పోటీ చేయడం అరుదైన విషయంగా పలువురు భావిస్తున్నారు. మరోవైపు ఆరో చోట్ల గెలిచినా ఇమ్రాన్ ఖాన్ ఎక్కడా ప్రాతినిధ్యం వహించరని పీటీఐ వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది అక్టోబరులో పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలను నిర్వహించాలని పీటీఐ డిమాండ్ చేస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి