
బ్రిక్స్లో భాగస్వామ్య దేశాలు వేటినీ వదిలేది లేదంటోంది అమెరికా. బ్రిక్స్లో భాగమైన భారత్ కూడా పదిశాతం అదనపు సుంకం చెల్లించాల్సిందేనని సంకేతాలిస్తున్నారు ట్రంప్. బ్రెజిల్లో సమావేశమైన 11దేశాల బ్రిక్స్ కూటమి ట్రంప్ ప్రతీకార సుంకాలను తప్పుపట్టింది. దీంతో మమ్మల్నే వేలెత్తి చూపిస్తారా.. మా డాలర్నే దెబ్బతీయాలని చూస్తారా అంటూ ఆవేశంతో ఊగిపోతున్నారు అమెరికా అధ్యక్షుడు. తమ విధానాలను వ్యతిరేకించిన బ్రిక్స్ దేశాలు కొత్త టారిఫ్లకు తోడు 10శాతం అదనపు సుంకం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పేశారు.
బ్రిక్స్తో పెద్ద ముప్పేమీ లేదంటూనే డాలర్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ట్రంప్ . ఆగ్రహం వ్యక్తంచేశారు. కానీ అలాంటిది జరగనివ్వమన్నారు. వారు గేమ్ మొదలుపెడితే తాను కూడా మొదలుపెడతానన్నారు ట్రంప్. డాలర్ ఎప్పటికీ రారాజే.. దాన్ని అలాగే కొనసాగిస్తామన్నారు ట్రంప్. ఎవరైనా దీన్ని సవాలు చేయడానికి ప్రయత్నిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు అమెరికా అధ్యక్షుడు. శ్వేతసౌధంలో ఆరో కేబినెట్ మీటింగ్ సందర్భంగా ఆయన కుండబద్దలు కొట్టేశారు.
భారత్తో అమెరికా సంబంధాలు బాగున్నాయి. దాంతో పెద్దన్న మన విషయంలో మొండికేయడనే అనుకున్నారంతా. కానీ ఎవరికీ ఎలాంటి మినహాయింపులూ లేవంటున్నారు ట్రంప్.ఎవరైనా బ్రిక్స్లో ఉంటే వారిపై 10శాతం సుంకాలు తప్పవని తేల్చేశారు. భారత్, రష్యా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సహా బ్రిక్స్లోని 11 దేశాలు ప్రపంచ జీడీపీలో 40శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు సగం ఈ దేశాలదే. అందుకే బ్రిక్స్ కూటమి రియో డిక్లరేషన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. చివరికి వాణిజ్య భాగస్వామిగా ఉన్న భారత్కి కూడా ఎలాంటి మినహాయింపులూ ఇవ్వలేనని ట్రంప్ చెప్పేశారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఆశాజనకంగా ఉన్న సమయంలో ట్రంప్ ప్రకటన భారత్ ఊహించని పరిణామం. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచడంతో పాటు రక్షణ, సాంకేతికత అంశాల్లో సహకారాన్ని పెంపొందించుకునే లక్ష్యంతో వాణిజ్య ఒప్పందానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్ విషయంలో అమెరికా పంతాలకు పోదనుకుంటే.. ఆగస్టు 1 నుంచి సుంకాలు అమల్లోకి వస్తాయని, ఈసారి గడువు పొడిగింపేమీ ఉండదని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్.