China-Taiwan: తైవాన్‌ జలాల్లోకి దూసుకెళ్లిన చైనా యుద్ధనౌకలు.. ద్వీప దేశాన్ని దిగ్భందించేందుకు ప్లాన్..!

|

Aug 09, 2022 | 7:32 AM

కయ్యానికి సిద్ధంగా చైనా..తగ్గేదే లే అంటూ తైవాన్‌ జలాల్లోకి యుద్ధనౌకలతో భయపెడుతోంది..అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన చైనా-తైవాన్‌ మధ్య ఇంకా అగ్గి రాజేస్తూనే ఉంది.

China-Taiwan: తైవాన్‌ జలాల్లోకి దూసుకెళ్లిన చైనా యుద్ధనౌకలు.. ద్వీప దేశాన్ని దిగ్భందించేందుకు ప్లాన్..!
China Taiwan
Follow us on

China Taiwan Conflict Updates: చైనా-తైవాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్‌పై తమకు సర్వ హక్కులు ఉన్నాయని భావిస్తున్న చైనా.. అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించి వెళ్లాక కోపంతో రగిలిపోతోంది. పెలోసీకి ఆతిథ్యమిచ్చిన తైవాన్‌ను శిక్షించాలని బలంగా కోరుకుంటోంది. అదే సమయంలో అమెరికాకు కూడా బుద్ధి చెప్పాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే తేపే చుట్టూ మిలటరీ విన్యాసాలు ప్రారంభించింది. అది చూసిన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు వెంటనే ఆ విన్యాసాలు కట్టిపెట్టాలని చైనాను కోరాయి. తాజాగా చైనా యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు.. తైవాన్‌ సముద్ర జలాల్లోని మీడియన్‌ లైన్‌ను దాటేసి ముందుకు దూసుకొచ్చాయి. ఈ పరిణామం పట్ల తైవాన్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

చైనా చర్యలకు ప్రతిస్పందనగా తమ ల్యాండ్‌–బేస్డ్‌ మిస్సైల్‌ వ్యవస్థలను యాక్టివేట్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. తమ వైమానిక, నావికా దళాలు పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేస్తాయని ప్రకటించింది. ఒకవేళ చైనా దాడికి దిగితే ప్రతీకార దాడులు తప్పవని తైవాన్‌ రక్షణశాఖ ఇప్పటికే హెచ్చరించింది. అటు తైవాన్‌ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భారీగా యుద్ధనౌకలను, యుద్ధవిమానాలను సిద్ధం చేసుకుంటోంది. చైనా తమపై దాడికి ప్రయత్నిస్తోందని, ప్రపంచ దేశాలు స్పందించాలని కోరింది. ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమైన అమెరికా తైవాన్‌కు అన్ని విధాలుగా అండదండగా ఉంటోంది.

అయితే అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటనను వ్యతిరేకిస్తూ చైనా ప్రస్తుతం తైవాన్‌ను చుట్టుముట్టి పెద్ద ఎత్తున సైనిక కసరత్తులు నిర్వహిస్తోంది.మరీ చైనా తైవాన్‌పై పూర్తిగా యుద్ధం ప్రారంభిస్తుందా లేక మిలటరీ డ్రిల్స్‌తో సరిపెడుతుందా అన్నది తేలాల్సి ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..