కెన్యా ప్రభుత్వం కాకులపై యుద్దం ప్రకటించింది.10 లక్షల భారతీయ కాకులను చంపాలని ప్లాన్ చేసింది. అసలు కెన్యా ప్రభుత్వం కాకులపై ఎందుకంత కక్ష కట్టింది…? కాకులతో కెన్యాకు వచ్చిన కష్టమేంటి..? కాకులు చేసిన నష్టమేంటి…? ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది.
కాకులతో కయ్యానికి దిగింది కెన్యా ప్రభుత్వం. భారతదేశం నుంచి పెద్ద ఎత్తున వచ్చి.. తమ దేశ పర్యావరణం, పరిశ్రమలను దెబ్బ తీస్తున్నాయంటూ కాకులపై కన్నెర్ర చేసింది. దేశంలో కాకి అరుపులే లేకుండా చేయాలని గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూ విఫలమవుతున్న కెన్యా ప్రభుత్వం, ఈ సారి పకడ్భందీగా ప్లాన్ చేసింది. సుమారు 10 లక్షల కాకులను అంతమొందించేందుకు పథకం ప్రకారం ముందుకెళ్తోంది.
భారతదేశం నుంచి వెళ్లిన కాకులు సంఖ్య కెన్యాలో క్రమంగా పెరిగిపోయింది. దీంతో కెన్యాలో ఎక్కడ చూసినా కాకులే కనిపిస్తుండటం, అవి మరింత దూకుడుగా వ్యవహరిచడంతో కెన్యా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఆహారాన్ని దొంగలించడం, పంట నష్టం కలిగించడం, స్థానిక పక్షులను వెంటాడటం వంటి చాలా కారణాలతో… అసలు కాకులే లేకుండా చేయాలని భావిస్తోంది కెన్యా ప్రభుత్వం. అందులో భాగంగానే కాకులను వేటాడుతోంది.
కెన్యాలోని ప్రజలే కాదు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు సైతం కాకులపై ప్రభుత్వానికి కంప్లైంట్ చేశారు. తాము నెలకొల్పిన పరిశ్రమలను కాకులు దెబ్బ తీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంపులు గుంపులుగా తమ వ్యాపార ప్రాంగణంలోకి వచ్చి తయారు చేసిన వస్తువులను సర్వనాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పర్యావరణ ప్రేమికులు కూడా కాకులు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ కాకులతో పర్యావరణ పూర్తిగా దెబ్బతింటోందని వారు మండిపడుతున్నారు. అంతేకాదు… భారత కాకుల కారణంగా కెన్యాలోని సముద్ర ప్రాంతాల్లో ఉండే చిన్న, స్థానిక పక్షుల సంఖ్య బాగా తగ్గిపోయిందంటున్నారు. భారత కాకులు… పక్షుల గూళ్లు, వాటి గుడ్లు, పిల్లలను తింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత కాకులు లేకుంటేనే కెన్యాలో కీటకాలు, ఇతర చిన్న జీవులు సమృద్ధిగా పెరుగుతాయని భావిస్తున్నారు.
మొత్తంగా… కాకులపై ఫైట్ మొదలుపెట్టిన కెన్యా ప్రభుత్వం, ఈసారైనా అనుకున్న పని కంప్లీట్ చేస్తుందా…? ఏ ఒక్క కాకి ఉండొదన్న టార్గెట్ను ఫినిష్ చేస్తుందా…? చూద్దాం ఏం జరుగుతుందో…!
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..