
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో శుక్రవారం (మే 29) తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. స్టాఫోర్డ్ కౌంటీలోని వర్జీనియా క్వాంటికో సమీపంలో, దక్షిణ దిశగా వెళ్లే ఐ-95 రహదారిపై తెల్లవారుజామున సుమారు 2:35 గంటల ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక ప్రయాణికుల బస్సు, నెమ్మదిగా వెళ్తున్న వాహనాల సమూహాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, బస్సు డ్రైవర్తో సహా డజన్ల కొద్దీ ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
రాష్ట్ర పోలీసులు విడుదల చేసిన ప్రాథమిక విచారణ నివేదిక ప్రకారం.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనివల్ల ఆ మార్గంలో దక్షిణం వైపు వెళ్లే వాహనాలు తమ వేగాన్ని తగ్గించాయి. అయితే, వెనుక నుంచి వస్తున్న బస్సు ట్రాఫిక్ను గమనించి వేగాన్ని తగ్గించడంలో పూర్తిగా విఫలమైంది. అతివేగంతో దూసుకొచ్చిన బస్సు ముందర ఉన్న ఆరు వాహనాలను ఒకదాని తర్వాత ఒకటిగా వరుసగా ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
ఫెడరల్ ట్రాన్సిట్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి పేటన్ వోగెల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, తాను చూసిన అత్యంత విషాదకరమైన సంఘటనలలో ఇది ఒకటి అని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు బలంగా ఢీకొట్టడంతో ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, ఆ కారులోనే నలుగురు సజీవ దహనమయ్యారని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురూ బస్సు ఢీకొట్టిన వాహనాల్లో ప్రయాణిస్తున్నవారేనని పోలీసులు స్పష్టం చేశారు. మృతులలో ఇద్దరు మహిళలు, ఒక బాలిక, ఒక బాలుడు ఉన్నారు. మసాచుసెట్స్లోని గ్రీన్ఫీల్డ్కు చెందిన 45 ఏళ్ల పురుషుడు, 44 ఏళ్ల మహిళ, 13 ఏళ్ల బాలిక, 7 ఏళ్ల బాలుడు ఒకే కారులో ఉండి ప్రాణాలు కోల్పోయారు. ఐదో బాధితురాలు మసాచుసెట్స్లోని వోర్సెస్టర్కు చెందిన 25 ఏళ్ల మహిళగా గుర్తించారు. ఆమె బస్సు ఢీకొట్టిన ఒక ఎస్యూవీలో ప్రయాణిస్తోంది.
ప్రమాదంలో గాయపడిన 44 మందిని వెంటనే సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మేరీ వాషింగ్టన్ హెల్త్కేర్ సంస్థ తమ ఆసుపత్రులలో 19 మంది రోగులను చేర్చుకున్నట్లు తెలిపింది. ఫ్రెడరిక్స్బర్గ్లోని ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్టాఫోర్డ్లోని ఆసుపత్రిలో చేరిన మరో 12 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు.
ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ను న్యూయార్క్లోని స్టేటెన్ ఐలాండ్కు చెందిన 48 ఏళ్ల జింగ్ ఎస్. డాంగ్గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతనిపై త్వరలోనే కఠినమైన చట్టపరమైన అభియోగాలు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. బస్సులోని ప్రయాణికులు రోండా రైట్, వేన్ టోబిన్ ఆసుపత్రి వెలుపల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ భయానక క్షణాలను పంచుకున్నారు. ప్రమాదానికి చాలా ముందే డ్రైవర్ వాహనాన్ని అత్యంత నిర్లక్ష్యంగా, అతివేగంతో నడుపుతున్నాడని వారు ఆరోపించారు. “బస్సు మొదటి వాహనాన్ని ఢీకొట్టినప్పుడు మా భయం నిజమైంది. ఆ తర్వాత డ్రైవర్ బస్సును ఆపలేకపోయాడు. ఒకదాని తర్వాత ఒకటి వాహనాలను గుద్దుకుంటూనే పోయింది. బస్సు లోపల ప్రయాణికుల కేకలు, పొగ, గాలిలో ఎగురుతున్న వస్తువులతో నరకం కనిపించింది. మేము మృత్యు ఉచ్చులో చిక్కుకున్నట్లు అనిపించింది” అని వారు వాపోయారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు తమ ఫోన్లు, పర్సులు, గుర్తింపు కార్డులను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రమాదానికి గురైన బస్సును నార్త్ లినాలోని కింగ్స్ మౌంటెన్కు చెందిన ‘E&P ట్రావెల్, ఇంక్.’ అనే సంస్థ నిర్వహిస్తోంది. రికార్డుల ప్రకారం ఈ కంపెనీని నవంబర్ 24, 2023న షువో లియు అనే వ్యక్తి స్థాపించారు. ఈ సంస్థకు కేవలం 4 వాహనాలు, 11 మంది డ్రైవర్లు మాత్రమే ఉన్నారు. జాతీయ రవాణా భద్రతా బోర్డు ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపడానికి ఒక ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించింది. ప్రమాదం కారణంగా నిలిచిపోయిన రహదారి లేన్లను మధ్యాహ్నానికి పునరుద్ధరించినప్పటికీ, మైళ్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా, అమెరికాలో అంతర్రాష్ట్ర ప్రయాణీకుల బస్సుల భద్రత అనేది దశాబ్దాలుగా పెద్ద సవాలుగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..