
అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం మిగిల్చిన విషాదం అంతా ఇంత కాదు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలి దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో ఎయిరిండియా విమానానికి అటువంటి పరిస్థితే ఏదురైంది. అయితే, పైలట్లు సకాలంలో అప్రమత్తంగా వ్యవహరించడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. లండన్లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు రావాల్సిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంAI 132లో సాంకేతికలోపం తలెత్తింది. ఇంజిన్ స్టార్ట్ చేసే సమయంలో సమస్యలను పైలట్లు ముందే గుర్తించారు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో లండన్ – బెంగళూరు ఎయిరిండియా విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇంజిన్ ఇంధన నియంత్రణ స్విచ్లో సమస్య ఉందని పైలట్ గుర్తించడంతో తమ బోయింగ్ 787 డ్రీమ్లైనర్ను నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా సోమవారం (ఫిబ్రవరి 02) ప్రకటించింది. ఈ విమానం లండన్ నుండి బెంగళూరుకు ఎగరాల్సి ఉంది. ఈ బోయింగ్ డ్రీమ్లైనర్లో రెండు ఇంజన్లు ఉన్నాయి. ప్రతి ఇంజన్కు ఒక స్విచ్ ఉంటుంది. అహ్మదాబాద్ ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తులో రెండు స్విచ్లు టేకాఫ్ అయిన ఒక సెకనులోనే అకస్మాత్తుగా రన్ నుండి కటాఫ్ మోడ్కి మారాయని తేలింది. అయితే తాజాగా ఈ విమానంలో అలాంటి సమస్యే తలెత్తింది. ఇంజిన్ స్టార్ట్ చేసే సమయంలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ ఆన్ కాకపోవడాన్ని పైలట్లు గుర్తించారు. ఎడమవైపు ఉన్న స్విచ్ రన్ పొజిషన్లో ఉండకుండా.. ఆటోమేటిక్గా రెండుసార్లు కటాఫ్ పొజిషన్కు మారిపోయినట్లు గమనించారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని వెంటనే నిలిపివేసినట్లు ఎయిరిండియా ప్రకటించింది.
టేకాఫ్ కు సిద్ధమవుతున్న సమయంలో, ఇంధన నియంత్రణ స్విచ్ స్థానంలో లేకపోవడం, పదే పదే కట్ అవుతుండటం పైలట్ గమనించాడని ఎయిర్ ఇండియా ప్రకటనలో తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని వెంటనే నిలిపివేసినట్లు తెలిపింది. సర్వీసు తొలగించినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ సమస్యను దర్యాప్తు చేయడానికి కంపెనీ అసలు విమాన తయారీదారు (OEM)ను పిలిపించింది.
ఈ మొత్తం సంఘటన గురించి ఏవియేషన్ రెగ్యులేటర్ DGCAకి సమాచారం అందించింది. భద్రతను నిర్ధారించడానికి, ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787 విమానాలన్నింటిలోని స్విచ్లను తనిఖీ చేసింది. అయితే ఇతర విమానాల్లో లోపాలు ఏవీ కనుగొనలేదని అధికారులు తెలిపారు. ప్రయాణీకులు, సిబ్బంది భద్రత తమకు అత్యంత ముఖ్యమైనదని ఎయిర్ ఇండియా పేర్కొంది. స్వల్పంగా అనుమానం ఉన్నప్పటికీ ఈ కఠినమైన చర్య తీసుకోవడం జరిగిందని ఎయిరిండియా తెలిపింది. ఇక ఈ విమానంలో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది.
Today, during the operation of Air India Flight Al132 (London Heathrow to Bengaluru), the crew reported abnormal behaviour of the LEFT engine fuel control switch on Boeing 787-8 aircraft VT-ANX. During engine start, the switch failed to remain locked in the RUN position on two… https://t.co/AeNgrO1Pdd
— ANI (@ANI) February 2, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..