రంజాన్ పవిత్ర మాసం వేళ ఆప్ఘనిస్థాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజధాని కాబూల్లో ఉన్న ఓ మసీదు వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మత గురువు(ఇమామ్) మృతి చెందగా.. మరో 16మంది గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల కోసం మసీదుకు వచ్చిన సమయంలో ఈ పేలుడు జరిగింది. ప్రార్థనల కోసం మత గురువు ఉపయోగించే మైక్రోఫోన్లో బాంబును అమర్చినట్లు జిల్లా పోలీస్ అధికారి జాన్ అఘా వెల్లడించారు. కాగా ఇది తమ పనేనని ఇంతవరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు. అయితే తాలిబన్లు, ఐసిస్ ఉగ్రవాదులు తరచుగా అక్కడ దాడులు జరుపుతుంటారు.