మరోసారి భగ్గుమన్న హోర్ముజ్‌ జలసంధి! మూడు LNG ట్యాంకర్లపై దాడి!

ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల నడుమ, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిలో వరుస ట్యాంకర్ దాడులు జరిగాయి. ఖతార్ LNG ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరగగా, సౌదీ ట్యాంకర్ కూడా దెబ్బతింది. అంతర్జాతీయ నౌకాయానం భద్రతకు ముప్పుగా ఖతార్ ఖండించింది.

మరోసారి భగ్గుమన్న హోర్ముజ్‌ జలసంధి! మూడు LNG ట్యాంకర్లపై దాడి!
Hormuz Strait

Updated on: Jul 07, 2026 | 9:39 PM

మరోసారి హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరాన్ – అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో మంగళవారం వరుస దాడులు జరిగినట్లు సమాచారం. మూడు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్ దాడులు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వీటిలో ఖతార్‌కు చెందిన LNG ట్యాంకర్ ‘అల్ రెకయ్యత్’ ఇంజిన్ గదిలో మంటలు చెలరేగగా, భారీ పేలుడు ప్రమాదం తప్పినట్లు రాయిటర్స్ సంస్థ పేర్కొంది. ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభమైన తర్వాత హోర్ముజ్ జలసంధిలో నమోదైన తొలి ప్రధాన దాడులు ఇవే కావడం గమనార్హం.

“మేడే.. మేడే” అంటూ..

రాత్రి సమయంలో డ్రోన్ దాడికి గురైన ‘అల్ రెకయ్యత్’ ట్యాంకర్ కెప్టెన్ అత్యవసర రేడియో సందేశం పంపారు. “మేడే… మేడే… మేడే… ఇది LNG నౌక అల్ రెకయ్యత్. నౌక ఎడమవైపున డ్రోన్ దాడి జరిగింది. ఇంజిన్ రూమ్‌లో మంటలు చెలరేగాయి. అంతా పొగతో నిండిపోయింది. నౌక నిలిచిపోయింది. సమీపంలోని నౌకలు వెంటనే సహాయం చేయాలి.” అని షిప్ కెప్టెన్ అత్యవసర మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. సిబ్బంది క్షేమంగా ఉన్నప్పటికీ, ఇంజిన్లు, స్టీరింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో నౌక సముద్రంలోనే నిలిచిపోయినట్లు సమాచారం. యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ప్రకారం.. అదే ప్రాంతంలో మరో ట్యాంకర్‌పై కూడా డ్రోన్ దాడి జరిగింది. ఆ నౌకకు స్వల్ప నష్టం వాటిల్లినా, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అనంతరం అది తన ప్రయాణాన్ని కొనసాగించినట్లు అధికారులు వెల్లడించారు.

తీవ్రంగా ఖండించిన ఖతార్

హోర్ముజ్ జలసంధిలో జరిగిన దాడికి ఇరాన్‌నే బాధ్యత వహించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజేద్ అల్-అన్సారీ ఆరోపించారు. అంతర్జాతీయ నౌకాయానం భద్రతపై ఇది ప్రత్యక్ష దాడి అని పేర్కొంటూ, ప్రపంచ ఇంధన సరఫరాలకు ముప్పు కలిగించే చర్యలను ఇరాన్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ దాడి జరిగిన విషయాన్ని ప్రస్తావించినప్పటికీ, ఈ ఘటనకు తమకే సంబంధం ఉందని అధికారికంగా అంగీకరించలేదు.

సౌదీ సూపర్ ట్యాంకర్‌కు కూడా నష్టం

ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న సౌదీ జెండా కలిగిన ‘వెద్యాన్’ సూపర్ ట్యాంకర్ కూడా దెబ్బతిన్నట్లు సముద్ర భద్రతా వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ నష్టం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటివరకు ఈ దాడులకు ఏ సంస్థా లేదా దేశం బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు. ప్రపంచ చమురు రవాణాలో హోర్ముజ్ జలసంధి అత్యంత కీలక మార్గం. ఈ మార్గం గుండా ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం రవాణా అవుతోంది. దీంతో వరుస దాడులు ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఆందోళనకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై స్పందించిన ఇరాన్, యుద్ధ బెదిరింపులు కొనసాగితే శాంతి చర్చలు ఉండవని ప్రకటించింది. మరోవైపు, హోర్ముజ్ జలసంధిలో ప్రయాణించే చమురు ట్యాంకర్లు తప్పనిసరిగా తాము సూచించిన మార్గాల్లోనే ప్రయాణించాలని ఇరాన్ సైన్యం ఇటీవల హెచ్చరించడం ప్రస్తుత ఉద్రిక్తతలకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది.

Follow Us