కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకు చలి తీవ్రత పెరగటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉత్తర భారతం నుంచి వీస్తున్న చలి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత జనవరిలోనూ కొనసాగనుంది.ఆంధ్రప్రదేశ్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయనగరం, గుంటూరు, శ్రీకాకుళం, కర్నూలు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తాడేపల్లి గూడెం, ఒంగోలు, అనంతపురంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో అక్కడక్కడ పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. పొగమంచు దట్టంగా అలుముకుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. మినుములూరు, అరకులో 8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా…పాడేరు, చింతపల్లిలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలైనా మంచుతెరలు తొలగడం లేదు. తెలంగాణలోని ఆదిలాబాద్, పటాన్ చెరువు, రామగుండం, నిజామాబాద్, రాజేంద్రనగర్, హనుమకొండ, నల్గొండ, హైదరాబాద్, హయత్ నగర్, భద్రాచలం, దుండిగల్, హకీంపేట్, మహబూబ్ నగర్, ఖమ్మం ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాలలో అక్కడక్కడా శీతల గాలులు వీచే అవకాశం ఉంది. రానున్న రెండు రోజుల్లో చలితీవ్రత కాస్త తగ్గనుంది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం :