సైకిల్పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరి.. చరిత్ర సృష్టించిన టీచర్
ఉత్తరప్రదేశ్కు చెందిన దివ్యా సింగ్ అనే ఉపాధ్యాయురాలు సైకిల్పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరుకుని చరిత్ర సృష్టించారు. 14 రోజుల్లో 17,598 అడుగుల ఎత్తును అధిగమించి, సైకిల్పై ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు నెలకొల్పారు. గడ్డకట్టే చలి, ఆక్సిజన్ కొరత వంటి అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, మానసిక సంకల్పంతో విజయం సాధించిన దివ్య, మహిళలకు గొప్ప స్ఫూర్తిగా నిలిచారు.
సంకల్పం బలంగా ఉండాలే కానీ ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొని ఎంత ఎత్తుకైనా వెళ్లవచ్చని నిరూపించారు ఓ ఉపాధ్యాయురాలు. సాధారణంగా పర్వతారోహణ అంటే చాలా కష్టసాధ్యమైన పని. అలాంటిది ఉత్తరప్రదేశ్కు చెందిన ఈమె ఏకంగా సైకిల్పై ఎవరెస్ట్ బేస్క్యాంప్కు చేరుకొని చరిత్ర సృష్టించారు. గోరఖ్పూర్కు చెందిన 28 ఏళ్ల దివ్యా సింగ్, కేవలం 14 రోజుల్లో సైకిల్పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు. సాధారణంగా సాహస యాత్రికులు కాలినడకన చేరుకునే ఈ లక్ష్యాన్ని, సైకిల్పై అధిగమించిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన దివ్య.. సముద్ర మట్టానికి సుమారు 17,598 అడుగుల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్కు చేరుకున్నారు. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. మైనస్ 12 డిగ్రీల గడ్డకట్టే చలిలో, ఆక్సిజన్ తక్కువగా ఉండే ప్రాంతాల్లో రోజుకు 10 నుంచి 12 గంటల పాటు సైకిల్ తొక్కారు. కొన్నిచోట్ల దారి సరిగా లేకపోవడంతో, తన సైకిల్ను భుజాలపై మోసుకుంటూ ముందుకు సాగడం ఆమె సంకల్పానికి నిదర్శనం. ఈ ఘనత సాధించడంపై దివ్యా సింగ్ స్పందిస్తూ.. ఒక సాధారణ ఉపాధ్యాయురాలు ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది. శారీరక బలం కంటే మానసిక ధైర్యమే తనను లక్ష్యం వైపు నడిపించిందని దివ్యాసింగ్ తెలిపారు. మహిళలు తలచుకుంటే ఎంతటి కష్టమైన పనినైనా సాధించగలరని నిరూపించడమే తన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. దివ్యా సింగ్ సాధించిన ఈ అద్భుత విజయం పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె విజయం దేశంలోని ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్చకుల విదేశీయానం ధర్మ విరుద్ధమా ??
ప్రాణం తీసిన చేప.. మృతి వెనుక అసలేం జరిగింది ??
బురఖాలో వచ్చింది.. గన్ బయటకు తీసింది.. ఆ తర్వాత..
