తిరుమల భక్తులకు అలర్ట్.. కొండపై మళ్లీ చిరుత సంచారం..! వీడియో
తిరుమలలో చిరుత సంచారం మరోసారి తీవ్ర సంచలనం రేపుతోంది. తిరుమల శిలాతోరణం వద్ద చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. చిరుతను చూసిన భక్తులు.. ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పక్కన ఉన్నవారికి చెప్పడంతో వారు కూడా అలర్ట్ అయ్యారు. ఇక చిరుత సంచారానికి సంబంధించిన సమాచారాన్ని భక్తులు.. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు తెలియజేశారు. వెంటనే టీటీడీ అధికారులు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
హుటాహుటిన వారంతా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.సర్వదర్శనం క్యూలైన్ సమీపంలోనే చిరుత కనిపించడంతో భక్తులు వణికిపోయారు.. కాగా.. శిలాతోరణం దగ్గర ఉన్న కొండపై రాజసం ఒలకబోస్తూ కూర్చున్న చిరుత ఫోటో, వీడియో వైరల్గా మారింది. ఇక చిరుత సంచారం నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. భక్తులు ఒంటరిగా వెళ్లొద్దని..గుంపులు గుంపులుగా వెళ్లాలని తెలిపారు. తిరుమలలో మరోసారి చిరుత సంచరిస్తుండటంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతంలో తిరుమల కాలినడక మార్గంలో ఓ చిన్నారిని పొట్టనపెట్టుకుంది చిరుత. లక్షిత అనే ఆరేళ్ల బాలికపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. అంతేకాకుండా.. పలువురు భక్తులపై కూడా దాడి చేసిన సందర్భాలున్నాయి.. అంతకుముందు జరిగిన సంఘటనల దృష్ట్యా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.