వీడిని అసలు మనిషంటారా..వీడియో
కన్నుమూస్తే మరణం..కన్ను తెరిస్తే జననం.. రెప్పపాటు కాలం జీవితం.. ఈ జీవితసత్యాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు కొందరు. నీది, నాది అనే అహంకారంతో మానవత్వాన్నే మరిచిపోతున్నారు. పుట్టిన ప్రతి మనిషి జీవితం ఒకలా ఉండకపోవచ్చు.. కానీ మరణించిన ప్రతి మనిషీ చేరాల్సింది మట్టిలోకే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. స్వంత ఇంటి యజమానులు కొందరు అద్దెకుండేవారిపట్ల చూపే వివక్ష చూస్తుంటే సొంత ఇంటి ఆవశ్యకత ఏంటో తెలుస్తోంది. అప్పటి వరకూ తమతో కలిసి తమ ఇంట్లో అద్దెకున్న వ్యక్తి మరణిస్తే.. ఆ మృతదేహాన్ని తన ఇంటికి తీసుకురాకుండా అడ్డుకున్నడో వ్యక్తి. అప్పటి వరకూ అతను ఇచ్చిన అద్దె డబ్బుతో జీవనం సాగించి..అతను మరణించగానే డెడ్ బాడీని తన ఇంటికి తీసుకు రావడానికి వీల్లేదంటూ అడ్డుకున్నాడు. కానీ స్థానికులు మాత్రం ఈ దారుణాన్ని చూస్తూ ఊరుకోలేదు.. అతనికి బుద్ధి చెప్పారు.. తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటన కడపజిల్లా ప్రొద్దుటూరులో జరిగింది.
కడప జిల్లా ప్రొద్దుటూరు లో ఓ ఇంటి యజమాని తీరు అందరిని ఆగ్రహానికి గురిచేసింది .. తన ఇంట్లో అద్దెకు ఉంటూ చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కనీసం ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్న ఆ యజమాని తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్నన్ని రోజులు అద్దె తీసుకున్న ఆ యజమాని మానవత్వాన్ని మరిచి కఠినంగా వ్యవహరించాడు. దాదాపు రెండు గంటలసేపు మృతదేహాన్ని ఇంటిలోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు. దీంతో స్థానికులంతా ఏకమై ఇంటి యజమాని తీరును ఎండగట్టారు. అంతేకాదు, అతని తీరుపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి ఇంటి యజమానితో మాట్లాడి ఆ మృతదేహాన్ని ఇంటిలోకి తీసుకువెళ్లేలా ఒప్పించారు. ఇంటి యజమాని తీరును అసహ్యించుకున్న స్దానికులు ఇన్నాళ్లూ అతను చెల్లించిన అద్దె డబ్బులు దండుకొని మనిషి చనిపోతే ఇంట్లోకి రానివ్వకపోవడం దారుణమని, సాటి మనిషి పట్ల సానుభూతితో ఉండాలని హితవు పలికారు.
మరిన్ని వీడియోల కోసం :
