పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
పిల్లల మొబైల్ వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు తల్లిదండ్రుల ఫోన్లను టార్గెట్ చేస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గేమింగ్ యాప్స్, సోషల్ మీడియా యాడ్స్ పేరుతో ప్రమాదకరమైన ఏపీకే ఫైల్స్, లింకులు పంపి మాల్వేర్ ఇన్స్టాల్ చేయిస్తున్నారు. దీంతో వ్యక్తిగత సమాచారం, యూపీఐ వివరాలు, వాట్సాప్ ఖాతాలు నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. పిల్లలకు ఫోన్ ఇచ్చే ముందు తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో పిల్లలకు సెల్ ఫోన్ ఒక వ్యసనంగా మారిపోయింది. చేతిలో సెల్ఫోన్ లేనిదే భోజనం చేయని పరిస్థితి. పాలు తాగాలన్నా, ఏడుపు ఆపాలన్నా పిల్లల చేతికి ఫోన్ ఇవ్వడం తల్లిదండ్రులకు సాధారణమైపోయింది. రాత్రి పన్నెండు దాటినా సోషల్ మీడియా, గేమింగ్ యాప్స్, రీల్స్తో గడిపేస్తూ డిజిటల్ అడిక్షన్ బారిన పడుతున్నారు. దీనివల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, తల్లిదండ్రుల ఆర్థిక మూలాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పిల్లల మొబైల్ అడిక్షన్ను అదనుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్కు పాల్పడుతున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్లలో వచ్చే స్పాన్సర్డ్ యాడ్స్, గేమింగ్ యాప్స్ వెనుక ప్రమాదకరమైన ఏపీకే ఫైల్స్, ఇన్స్టంట్ లోన్ యాప్స్ లింకులు దాగి ఉంటాయి. తెలియనితనంతో పిల్లలు వీటిని క్లిక్ చేయగానే మీ ప్రమేయం లేకుండానే మొబైల్లోకి మాల్వేర్ ప్రవేశిస్తుంది. దీని ద్వారా మీ కాల్ ఫార్వర్డింగ్ ఆన్ చేయడం, యూపీఐ లింక్లను ఆపరేట్ చేయడం లేదా మీ ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించి లోన్లు తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. విశాఖపట్నంలో ఇలాంటి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకసారి ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ అయితే మీ మొబైల్ సమాచారమంతా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. కొన్నిసార్లు మీ వాట్సాప్ లాగౌట్ అయిపోయి, హ్యాకర్లు మీ కాంటాక్ట్ లిస్ట్లోని వ్యక్తులకు ఆపదలో ఉన్నానంటూ మెసేజ్లు పంపి డబ్బులు గుంజుతారు. ఇటీవల ఒక వైద్యుడు కూడా ఇలాగే ఏపీకే ఫైల్ క్లిక్ చేసి తన మొబైల్ పై యాక్సెస్ కోల్పోయారు. పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చే ముందు తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకింగ్ యాప్స్, వ్యక్తిగత వివరాలు ఉన్న ఫోన్లను పిల్లలకు ఇవ్వకూడదని స్పష్టం చేస్తున్నారు. ఏటీఎం పాస్వర్డ్లను ఫోన్లలో సేవ్ చేయవద్దని, పబ్లిక్ వైఫైలలో బ్యాంకింగ్ లావాదేవీలు జరపవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే వెంటనే ఇంటర్నెట్ లావాదేవీలను నిలిపివేసి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!
కడుపు నిండా తింటూనే బరువు తగ్గొచ్చు.. ట్రెండింగ్లో ‘వాల్యూమెట్రిక్స్ డైట్’!
భోజనం చేసిన వెంటనే పండ్లు తినొచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజం ఇదే!
