AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..! కాబోయే అల్లుడితో మరో అత్త జంప్..

మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..! కాబోయే అల్లుడితో మరో అత్త జంప్..

Samatha J

|

Updated on: May 03, 2025 | 3:58 PM

రోజురోజుకు మానవ సంబంధాలు దారుణంగా దిగజారిపోతున్నాయా అనిపిస్తోంది. వావివరుసలు మరిచిపోయి.. కొందరు వివాహేతర సంబంధాలకు తెగబడుతున్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో ఓ అత్త కాబోయే అల్లుడితో పారిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే.. అచ్చం అలాంటి ఘటనే అదే రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌ బస్తీలోని దుబౌలియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ కూడా, ఒక మహిళ తన కాబోయే అల్లుడితో పారిపోయింది. కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో.. దుబౌలియా పోలీసులు యువకుడు, మహిళ కోసం వెతుకుతున్నారు.

మీడియా నివేదికల ప్రకారం.. దుబౌలియా ప్రాంతానికి చెందిన ఒక అబ్బాయికి గోండా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతితో నాలుగు నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. అప్పటినుంచి ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే సమయంలో, అమ్మాయి తల్లి కూడా అబ్బాయితో మాట్లాడటం ప్రారంభించింది. మొదట్లో కుటుంబ సభ్యులకు దీని గురించి ఏమీ అనుమానం రాలేదు. కానీ క్రమంగా సంభాషణ సమయం పెరగడం, ప్రవర్తనలో మార్పు రావడం చూసి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దాంతో మహిళను నిలదీయడంతో విషయం అర్థమైంది. దాంతో యువతి కుటుంబ సభ్యులు యువకుడితో వివాహం రద్దు చేశారు. అయితే యువతి తల్లి మాత్రం అతనితో తన పరిచయం కొనసాగించింది. మహిళ కుమార్తెకు కుటుంబ సభ్యులు వేరే సంబంధం చూసి మే నెలలో పెళ్లి జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈక్రమంలో మూడురోజుల క్రితం మహిళ తన కుమార్తెకు ముందుగా నిశ్చయించిన యువకుడితో వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. మొదట మహిళ కుటుంబ సభ్యులంతా కలిసి వారికోసం వెతికారు. ఎక్కడా ఆచూకీ దొరకకపోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్వరలోనే వారిద్దరిని వెతికి పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొబైల్ లొకేషన్లను స్కాన్ చేస్తున్నట్లు తెలిపారు.