పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!

Updated on: Mar 02, 2026 | 12:51 PM

అనంతపురం బుక్కరాయసముద్రం సాయిబాబా ఆలయంలో వెండి శఠగోపం చోరీకి గురైంది. భక్తుడి వేషంలో వచ్చిన ఒక వ్యక్తి, ప్రదక్షిణలు చేస్తున్నట్లు నటిస్తూ, నిశ్శబ్దంగా శఠగోపాన్ని తన సంచిలో వేసుకుని పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఆలయ కమిటీలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

సాధారణంగా భక్తులు ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకుని, పూజారి చేత తలపై ‘శఠగోపం’ పెట్టించుకుని ఆశీస్సులు పొందుతారు. కానీ, ఓ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా ఆ వెండి శఠగోపం పైనే కన్నేసి, దాన్ని తన సంచిలో వేసుకుని చక్కగా చెక్కేశాడు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ వింత చోరీ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువు కట్టపై ఉన్న సాయిబాబా ఆలయానికి రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి భక్తుడిలా వెళ్లాడు. భుజానికి బ్యాగ్ తగిలించుకుని వచ్చిన ఆ దుండగుడు, లోపలికి వెళ్లగానే దేవుడిని దర్శించుకోకుండా నేరుగా శఠగోపం ఎక్కడుందో గమనించాడు. సాయిబాబా విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు నటిస్తూ, చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసి చటుక్కున వెండి శఠగోపాన్ని తన సంచిలోకి సర్దేశాడు. ఏమీ తెలియనట్లు అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదు అనుకుంటుందట.. అలాగే ఈ చోర శిఖామణికూడా భావించాడు. ఇక ఆలయ అర్చకులు శఠగోపం కనిపించకపోవడంతో అనుమానం వచ్చి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో సదరు వ్యక్తి దొంగతనానికి పాల్పడిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. “గుడికి వచ్చి దేవుడి ఆశీస్సులు తీసుకోవాల్సింది పోయి, ఏకంగా దేవుడి వస్తువులనే ఎత్తుకెళ్లడం ఏంటని” భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భక్తి ముసుగులో జరుగుతున్న ఇటువంటి దొంగతనాల పట్ల ఆలయ కమిటీలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Thanuja Puttaswamy: ఫ్యాన్ పై విరుచుకుపడ్డ తనూజ.. సిగ్గు లేదా అంటూ..

Rashmika-Vijay Marriage: మొత్తం 3 కిలోల బంగారు ఆభరణాలు.. ‘విరోష్‌’ ఆభరణాల ప్రత్యేకత ఏంటంటే ??

కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..

Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..

Rashmika-Vijay Marriage: ‘విరోష్’ సునామీ.. సోషల్‌ మీడియాలో రికార్డ్‌ బద్దలు!

Follow Us